మన సంప్రదాయం: కోడి పందేలపై మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు
చిత్తూరు: సంక్రాంతి పండగ అంటేనే కోడి పందేలు గుర్తువస్తాయి. పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ ఏదో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. తాజాగా, ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు కోడిపందేలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు నిర్వహించడం మన సంప్రదాయంగా వస్తోందన్నారు .కత్తులు, కట్టకుండానైనా పందేలు నిర్వహిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. తిరుపతి శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల ఆవరణలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన భోగి సంబరాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ కలిసి కట్టుగా సంక్రాంతి పండగను సంతోషంగా జరుపుకోవాలన్నారు. మంచు విష్ణు మాట్లాడుతూ.. ప్రతి ఏడాదిలానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ భోగి సంబరాలు జరుపుకుంటున్నామని తెలిపారు. భోగి పండగ రోజు సందర్భంగా కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలన్నారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు నిర్వహిస్తారు. కోట్లలో లావాదేవీలు జరుగుతుంటాయి. అయితే, పోలీసులు కోడి పందేలకు అనుమతి లేదని అంటున్నారు. కోడిపందేలు నిర్వహించేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.