ఏపీలో కరోనా: కర్నూలు, గుంటూరు బ్లాస్ట్.. మరణాలు, కేసులు పైపైకి.. ఫలిస్తోన్న ర్యాపిడ్ టెస్టింగ్స్..
''మనం కరోనా వెంట పరుగెత్తడం కంటే.. కరోనా కంటే ముందే మనం పరుగెత్తడం ఉత్తమం.. దానికి ఏకైక మార్గం మాస్ టెస్టింగ్స్''అని మహమ్మారి పుట్టినప్పటి నుంచి ప్రచారంలో ఉంది. పాజిటివ్ కేసులు వెలుగు చూసేదాకా ఆగేకంటే, ఎక్కువ టెస్టులు నిర్వహిస్తూ, మనమే కేసుల్ని ఛేజ్ చేయడం ద్వారా నంబర్ పెరిగినప్పటికీ, వైరస్ వ్యాప్తి ప్రమాదం చాలా వరకు కంట్రోల్ అవుతుందని నిపుణులు చెబుతూ వస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విధానాన్ని ప్రోత్సహిస్తున్నది. అందుకే ర్యాపిడ్ టెస్టింగ్స్ పై ప్రతిరోజూ రగడ జరుగుతోంది. మన దేశంలో కరోనా టెస్టింగ్స్, నియంత్రణ చర్యల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ముందడుగులోనే ఉన్నట్లు సాక్ష్యాత్తూ కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. సౌత్ కొరియా నుంచి తెప్పించిన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ వాడకంతో ఏపీలో కేసుల సంఖ్య అమాంతం పెరుగుతూవస్తున్నది.

కొత్తగా 75 కేసులు.. మూడు మరణాలు..
ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 75 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 722కు పెరిగింది. అందులో 92 మంది డిశ్చార్జికాగా, ప్రస్తుతానికి యాక్టివ్ కేసుల సంఖ్య 610గా ఉంది. గత 24 గంటల్లో 75 కొత్త కేసులతోపాటు మూడు మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 20కి పెరిగింది.

ఆ రెండు జిల్లాల్లో..
మొదటి నుంచీ గుబులురేపుతున్నట్లే కర్నూలు, గుంటూరు జిల్లాల్లో నంబర్లు బ్లాస్ అవుతున్నాయి. కర్నూలులో అత్యధికంగా 174 కేసులు, గుంటూరులో 149 నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో కృష్ణా జిల్లాలో 80, నెల్లూరు 67, చిత్తూరు 53, ప్రకాశం 44, కడప 40, వెస్ట్ గోదావరి 35, అనంతపురం 33, ఈస్ట్ గోదావరి 26, విశాఖపట్నం జిల్లాలో 21 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఇప్పటికీ కరోనా రహిత రిజిల్లాలుగానే కొనసాగుతున్నాయి. మరణాల పరంగా కృష్ణాలో అత్యధికంగా ఆరుగురు, కర్నూలులో 5, గుంటూరు 4, అనంతపురం 3, నెల్లూరులో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో అనంతపురం, కృష్ణా, కర్నూలులో ఒక్కో మరణం సంభవించింది.

దాని ఫలితమే ఇది..
రాష్ట్రంలో కరోనా టెస్టులు విరివిగా చేపడుతున్నందువల్లే కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం మధ్యాహ్నం దాకా మొత్తం 3,775 శాంపిల్స్ పరీక్షించగా అందులో 75 పాజిటివ్ కేసులు బయటపడ్డట్లు పేర్కొన్నారు. శనివారమైతే రికార్డు స్థాయిలో 5400 టెస్టులు చేపట్టారు. ఇంటింటి సర్వేల ద్వారా గుర్తించిన మరో 32 వేల మందికి కూడా టెస్టులు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. టెస్టుల సంఖ్య పెంచడంతోపాటు బయటపడే కొత్త కేసులకు చికిత్స అందించేలా ఆస్పత్రుల్లో సౌకర్యాలు కూడా మెరుగుపర్చినట్లు అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications