ఎంతైనా! మాట తప్పే.. మడమ తిప్పే వంశమే కదా!!: జగన్పై లోకేష్ ఫైర్
అమరావతి: మూడు రాజధానులంటూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపై టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ మాట, అధికారంలోకి వచ్చాక ఓ మాట మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.
ఎంతైనా మాట తప్పే.. మడమ తిప్పే వంశమే కదా..
‘రాజకీయ లబ్ది కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి వైఎస్ జగన్ గారు అనడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానిపై ఒక మాట. అధికారంలోకి వచ్చిన తరువాత మరోమాట. ఎంతైనా వారిది మాట మార్చే, మడమ తిప్పే వంశం కదా..' అని లోకేష్ ఎద్దేవా చేశారు.
అసెంబ్లీ సాక్షిగా అసత్యాలేనని..
‘వైఎస్ జగన్ గారు అసెంబ్లీ సాక్షిగా మరోసారి తన పత్రిక దొంగ పత్రిక, అందులో రాసేవి అన్నీ అసత్యాలే అని అంగీకరించినందుకు ధన్యవాదాలు. అలానే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, చంద్రబాబుగారు బీసీలకు అన్యాయం చేస్తున్నారు, ఒక్క రూపాయి కేటాయించలేదు అని జగన్ గారు ఆరోపించారు' అని లోకేష్ మండిపడ్డారు.

జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలి..
‘బీసీలకు స్వయం ఉపాధికల్పిస్తూ ఏర్పాటుచేసిన ఆదరణపథకంలో అవినీతి,నాణ్యతలేని వస్తువులు ఇస్తున్నారని ప్రచారంచేసారు. నాడుచేసిన తప్పుడుప్రచారానికి కూడా బహిరంగ క్షమాపణ చెబితే బాగుంటుంది. తెదేపా పాలనలో బీసీలకు 36వేలకోట్లు కేటాయించి 28.8వేలకోట్లు ఖర్చుపెట్టారని వైసీపీప్రభుత్వం ఒప్పుకుంది' అని లోకేష్ వ్యాఖ్యానించారు.

ఎవరు గొప్పవారో..
‘ఆదరణ పథకం అద్భుతం అని ప్రకటించింది. 23 జిల్లాలు ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో బీసీల కోసం 3 వేల కోట్లు కేటాయించిన వైఎస్ గొప్పవారో,13 జిల్లాలు ఉన్న నవ్యాంధ్రప్రదేశ్ లో 28.8 వేల కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబుగారు గొప్ప వ్యక్తో అర్ధం చేసుకోవాలి అని నా మనవి' అని లోకేష్ అన్నారు.












Click it and Unblock the Notifications