ఆవుల సుబ్బారావుకు ఐటీ నోటీసులు.. 27న హాజరు కావాలని ఆదేశాలు
అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ ఆందోళనలు మిన్నంటిన సంగతి తెలిసిందే. అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన విధ్వంసం కేసులో అల్లర్లను ప్రోత్సహించారని సాయి డిఫెన్స్ అకాడెమీ యజమాని ఆవుల సుబ్బారావు ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆదాయ పన్ను శాఖ నోటీసులు అందజేసింది. ఈ నెల 27న తమ ముందు విచారణకు హాజరు కావాలని అందులో ఐటీ అధికారులు సుబ్బారావును ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా నరసరావుపేటలో సాయి డిఫెన్స్ అకాడమీ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. ఆవుల సుబ్బారావు సైన్యంలో చేరాలనుకునే యువతకు శిక్షణ ఇస్తున్నాడు. అగ్నిపథ్ పథకానికి నిరసనగా జరుగుతున్న ఆందోళనల్లో పాల్గొనాలని, విధ్వంసం సృష్టించాలని తన వద్ద శిక్షణ తీసుకున్న అభ్యర్థులకు సూచించారట. సోమవారం నరసరావుపేట వచ్చిన ఐటీ, ఐబీ అధికారులు ఆయన అకాడమీలో సోదాలు చేశారు. విచారణకు రావాలని సుబ్బారావుకు ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
విధ్వంసం కుట్ర వెనుక ఉన్న అసలు నిందితులు ఎవరు అనే కోణంలో దర్యాప్తు జరుగుతుంది. విధ్వంసం వెనుక 16 కోచింగ్ సెంటర్ల పాత్ర ఉందని రైల్వే పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ఆదోళనకారుల నుంచి 10కి పైగా వాట్సప్ గ్రూపులను గుర్తించారు. వాట్సప్ చాటింగ్ వివరాలను సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనలో 15 మందిని పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని మరీ ప్రశ్నిస్తున్నారు. మరో 25 మంది పాత్ర ఉందని గుర్తించారు. ఇప్పటివరకు మొత్తం 56 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టుల సంఖ్య వంద వరకు పెరిగే అవకాశం ఉంది. వారందరినీ విచారిస్తామని.. నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని సిట్ అధికారులు చెబుతున్నారు.