రూ.18 వేల కాంట్రాక్ట్, అందుకే బీజేపీలో చేరిక, రాజగోపాల్ రెడ్డిపై కేటీఆర్
మునుగోడు బై పోల్ గురించి క్యాంపెయిన్ జోరందుకుంది. నేతల మధ్య మాటల యుద్దం కూడా తీవ్రస్థాయికి చేరింది. రాజీనామా చేసి, మళ్లీ బీజేపీ నుంచి బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ ఫైరయ్యారు. ఆయనకు కావాల్సింది తన బిజినెస్ తప్ప.. ప్రజల బాగోగులు కాదని కామెంట్ చేశారు. ఆయన ఏ రోజు కూడా జనం గోడు పట్టించుకోలేదని తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణ చేశారు. కోమటిరెడ్డి క్విడ్ ప్రొకోకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ ఓ ట్వీట్ను పోస్ట్ చేశారు. ఓ తెలుగు న్యూస్ ఛానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు.
6 నెలల క్రితం తన కంపెనీకి రూ.18 వేల కోట్ల విలువైన కాంట్రాక్టు దక్కిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వయంగా వెల్లడించిన విషయాన్ని గుర్తుచేశారు. ఓపెన్ బిడ్డింగ్లో పాల్గొన్న తన కంపెనీ ఈ కాంట్రాక్టును సాధించిందని చెప్పారు. ఈ వీడియోను టీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
ఈ వీడియోను తన ట్వీట్కు జత చేశారు. రూ.18 వేల కోట్ల విలువైన కాంట్రాక్టు దక్కినందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని తెలిపారు. ఇది క్విడ్ ప్రొకో కాక మరేమిటని కూడా ఆయన ప్రశ్నించారు. ఇక రాజగోపాల్ రెడ్డి బాటలోనే ఆయన సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సాగితే మంచిదని కేటీఆర్ సెటైర్లు వేశారు.