12th క్లాస్ పాసైన తేజ్ ప్రతాప్కు ఎంబీయే చదివిన ఐశ్వర్యతో పెళ్లి
పాట్నా: రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేత తేజ్ ప్రతాప్ యాదవ్ వివాహం వచ్చే నెలలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి ప్రసాద్ రాయ్ మనుమరాలు ఐశ్వర్యరాయ్తో జరగనుంది. దాదాపు పది నెలల క్రితం తన ఇద్దరు కుమారులకు వివాహ ప్రయత్నాలు ప్రారంభించినట్లు లాలూ ప్రసాద్ సతీమణి రబ్రీదేవి ప్రకటించారు.
తొలుత పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్కు సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. రాష్ట్రానికే చెందిన రాజకీయ కుటుంబానికి చెందిన యువతిని ఓకే చేశారు. వీరిద్దరి నిశ్చితార్థం ఈ నెలాఖరులో, పెళ్లి వచ్చే నెలలో జరగనుంది.
ఢిల్లీ యూనివర్సిటీకిలో గ్రాడ్యుయేట్ అయిన ఐశ్వర్యరాయ్ తండ్రి చంద్రికా రాయ్... లాలూ ప్రసాద్ యాదవ్కు చాలాకాలంగా స్నేహితుడు. ఆర్జేడీ తరఫున ఆరుసార్లు ఎన్నికల్లో గెలిచారు. లాలూ కేబినెట్లో మంత్రిగా పని చేశారు.
ఐశ్వర్య తాతయ్య ప్రసాద్ రాయ్ 1970వ దశకంలో బీహార్కు 11 నెలల పాటు ముఖ్యమంత్రిగా పని చేశారు. బీహార్లో తొలి యాదవ సీఎం ఆయనే. కాగా, ఈ యువజంట వివాహం పాట్నాలోని వెటర్నరీ కాలేజీ మైదానంలో జరగనుంది. తేజ్ ప్రతాప్ 12వ తరగతి చదవగా, ఐశ్వర్య రాయ్ ఎంబీయే చదివింది. మౌర్య హోటల్లో 18న ఎంగేజ్మెంట్ ఉంది.
నితీష్, మోడీలను ఆహ్వానిస్తాం
ఈ పెళ్లికి ప్రధాని నరేంద్ర మోడీని, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్లను పిలుస్తామని చెప్పారు. నితీష్ను చాచా అంటూ, మోడీని అంకుల్ అంటూ సంభోదించారు. 25 ఏళ్ల ఐశ్వర్య పాట్నాలోని ప్రముఖ నోట్రో డామ్ అకాడమీలో చదివారు. హిస్టరీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత అమిటీ యూనివర్సిటీ నుంచి ఎంబీయే పూర్తి చేశారు.