జమ్మూ కశ్మీర్లో ఎన్కౌంటర్: ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారత జవాన్లు
జమ్మూ కశ్మీర్లో మరోసారి కాల్పుల మోత మోగింది. పుల్వామా జిల్లాలో భద్రతాబలగాలకు ఉగ్రవాదులకు మధ్య జరిగిన భీకర ఎన్కౌంటర్లో భారత బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. సిర్నూ గ్రామంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్నఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో భద్రతా దళాలు ఆ గ్రామాన్ని జల్లెడ పట్టాయి. గ్రామం మొత్తం తనిఖీలు చేస్తున్న సమయంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.
ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో భద్రతాదళాలు కూడా ఎదురు కాల్పులకు దిగాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఇంకా ఉగ్రవాదులకు భారత బలగాల మధ్య భీకరపోరు జరుగుతోంది. ఈ మధ్యే జమ్మూ కశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో ప్రముఖ జర్నలిస్టు షుజాత్ బుఖారీని హత్యచేసిన ఉగ్రవాది నవీద్ జాట్ను మట్టుబెట్టాయి భద్రతాబలగాలు. ఇక అప్పటి నుంచి కశ్మీర్లోయలో ఉగ్రవాద కదలికలు అడపాదడపా కనిపిస్తున్నప్పటికీ ఇంత పెద్ద స్థాయిలో ఎన్కౌంటర్ జరగలేదు.