లేడీస్ హాస్టల్ లో ఒకే ఫ్యామిలీలో 7 మంది ఆత్మహత్యాయత్నం, ఆంధ్రా నుంచి చెన్నై వెళ్లి !
చెన్నైలో ఒకే ఫ్యామిలీలో ఏడు మంది ఆత్మహత్యాయత్నంఆంధ్రప్రదేశ్ నుంచి చెన్నై వెళ్లి లేడీస్ వర్కింగ్ హాస్టల్ నిర్వహణ10 ఏళ్ల లోపు చిన్నారులతో కలిసి విషం సేవించారు, ఆసుపత్రిలో మృత్యువుతో పోరాటం
చెన్నై: జీవితంపై విరక్తి చెందిన ఒకే ఫ్యామిలీలోని 7 మంది విషం సేవించి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన చెన్నైలోని షోలింగనూరు ప్రాంతంలో జరిగింది. ఐటీ కారిడార్ -రాజీవ్ గాంధీ సాలై ప్రాంతంలో లేడీస్ వర్కింగ్ హాస్టల్ (పీజీ) నిర్వహిస్తున్న ఎంగయ్య (65) అనే ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి విషం సేవించి ఆసుత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఎంగయ్య కుమార్తెలు మేఘ, చిన్న వెంగమ్మ, ఆయన కుమార్తెల పిల్లలు నుధిక్, నిషిత, నాగచైతన్య, శివప్రియ (1) అనే చిన్నారి విషం సేవించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసు అధికారులు చెప్పారు. ఎంగయ్య మిలటరీ రిటైడ్ ఉద్యోగి. వీరిది ఆంధ్రప్రదేశ్.
చెన్నై చేరుకున్న ఎంగయ్య కుటుంబ సభ్యులతో కలిసి లేడీస్ వర్కింగ్ హాస్టల్ నిర్వహిస్తూ అదే భవనంలో నివాసం ఉంటున్నారు. గురువారం రాత్రి పొద్దుపోయిన తరువాత ఎంగయ్య కుటుంబ సభ్యులతో కలిసి కూల్ డ్రింక్స్ లో విషం కలుపుకుని సేవించి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు.
శుక్రవారం ఉదయం లేడీఎస్ హాస్టల్ లోని టెర్రాస్ మీద ఏడు మంది అపస్మాకరస్థితిలో పడి ఉన్న విషయం హాస్టల్ లో పని చేసేవారు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి అందర్నీ ఆసుపత్రికి తరలించారు.
సంఘటనా స్థలంలో తెలుగులో రాసిన డెత్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డెత్ నోట్ లో మా ఆత్మహత్యలకు ఎవ్వరూ కారణం కాదని, జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుంటున్నామని రాసి ఉందని పోలీసు ఇన్స్ పెక్టర్ ఎంజీ. సుందర్ మీడియాకు చెప్పారు. ఆర్థిక సమస్యల కారణంగా వీరందరూ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారని తెలిసిందని, వారు కోలుకున్న తరువాతే పూర్తి విషయాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు.