దారుణం: మూఢనమ్మకంతో కన్నకూతుర్నే బలిచ్చాడు
లక్నో: కుటుంబ ఆర్థిక స్థితి మెరుగవ్వాలని ఆశిస్తూ మూఢనమ్మకాల్లో కూరుకుపోయిన ఓ వ్యక్తి.. కన్నకూతురని కూడా చూడకుండా బలిచ్చాడు. ఈ దారుణ ఘటన ఉత్తర్ప్రదేశ్లోని కాన్పూర్లో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక సికందర గ్రామంలో నివసిస్తున్న గిర్జేశ్ అనే వ్యక్తి తంత్ర విద్యలు సాధన చేస్తుంటాడు. తన కుటుంబ పరిస్థితి బాగుపడాలంటే కూతురిని బలివ్వాలని భార్య సునితకి చెప్పాడు.
ఈ విషయమై శనివారం ఇద్దరి మధ్య తీవ్ర వాదన జరిగింది. అందుకు ససేమిరా ఒప్పుకోనంటూ సునిత ముగ్గురు పిల్లల్ని తన గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టుకుంది.
అయినా తన మూర్ఖత్వాన్ని మూఢనమ్మకాన్ని వదులుకోని గిర్జేశ్.. అదను చూసి తన మైనర్ కూతుర్ని ఎత్తుకెళ్లి చంపేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.
నడిరోడ్డుపై వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపారు
తమిళనాడులో వెల్లోర్ జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై చుట్టూ జనం చూస్తుండగా వారి మధ్యలో నిల్చుని ఇద్దరు వ్యక్తులు మహాలింగం అనే వ్యక్తిని అతి క్రూరంగా బండరాయితో కొట్టికొట్టి చంపేశారు. దీంతో అక్కడి వారంతా నిశ్చేష్టులయ్యారు.
ఏ ఒక్కరూ ఈ హత్యకు పాల్పడుతున్న వ్యక్తులను ఆపేందుకు ప్రయత్నించలేదు. ఆ దృశ్యాలను హత్యకు పాల్పడుతున్నవారికి సంబంధించినవారే ఫొటోలు తీయగా వాటి ఆధారంగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాత కక్షల నేపథ్యంలోనే అతడిని వారు హత్య చేసినట్లు తెలిసింది. వారిద్దరు కూడా స్థానిక ఇంజినీరింగ్ కాలేజీ యజమాని కుమారులని, వారికి ఒక ముఠా కూడా ఉంది. అయితే, మహాలింగం పాత నేరస్థుడని, తమ అంకుల్ని హత్య చేసిన నేపథ్యంలోనే అతడిని వారిద్దరు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.