నా కిడ్నీ దొంగిలించారు: కలెక్టర్కు బాధితుడి ఫిర్యాదు
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన వద్ద పని చేసే ఓ కార్మికుడి కిడ్నీని అతనికి తెలియకుండా దొంగిలించాడు అతడి యజమాని. ఐదురోజుల తర్వాత స్పృహలోకి వచ్చేసరికి కిడ్నా భాగంలో ఆపరేషన్ చేసివుండటంతో బాధితుడు లబోదిబోమని విలపించాడు. కాగా, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని, చెబితే ప్రాణాలు తీస్తామని యజమాని మనుషులు అతడ్ని తీవ్రంగా హెచ్చరించారు.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తిరుచ్చి జిల్లా తిరునల్లూరులో ఉన్న ఒక నూనెమిల్లులో రాజవేలు(40) అనే వ్యక్తి కూలీగా పనిచేస్తున్నాడు. ఈ కర్మాగార యజమాని ప్రకాశంకు రెండు కిడ్నీలు చెడిపోయినట్లు తెలిసింది. దీంతో కిడ్నీ మార్పిడికి అదే కర్మాగారంలోని వందమంది కార్మికులకు రక్త పరీక్షలు నిర్వహించి 'ఓ పాజిటివ్' గ్రూపు ఉన్న రాజవేలును కిడ్నీ దానం చేయాలని కోరారు. ఇందుకు రూ.20 లక్షలు ఇస్తామని ఆశ చూపారు.
అయితే కిడ్నీ దానానికి రాజవేలు ససేమిరా అన్నాడు. ఈ క్రమంలో మార్చి 9వ తేదీన రాజవేలుకు మత్తు మందు ఇచ్చి చెన్నైలోని ఒక ఆస్పత్రికి తరలించారు. ఐదు రోజుల తరువాత రాజవేలు స్పృహలోకి రాగానే యజమాని తరఫు వ్యక్తులు అతని చేతిలో రూ.25 వేలు పెట్టారు. వద్దని చెప్పడంతో రూ.లక్ష ఇస్తామన్నారు.
ఆ డబ్బును కూడా నిరాకరించడంతో డబ్బులు బ్యాంకులో వేస్తామని, ఊరు వదిలి వెళ్లిపోవాలని.. లేదంటే ప్రాణాలతో ఉండవని బెదిరించారు. తన రేషన్ కార్డు, ఓటరు కార్డు దొంగిలించిన యజమాని మనుషులు, తనకు తెలియకుండా తన కిడ్నీని బలవంతంగా తీసుకున్నారని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు బాధితుడు రాజవేలు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, విచారణ జరపాలని కలెక్టర్ పోలీసులను ఆదేశించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.