కావేరీ రగడ: మరోకరు బలి, భార్య నిండుగర్భిణి
బెంగళూరు: బెంగళూరు నగరంలో జరిగిన కావేరీ గొడవల్లో మరో యువకుడు మరణించాడు. పోలీసుల లాఠీ దెబ్బలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన కుమార్ (25) అనే యువకుడు మృతి చెందాడు.
తుమకూరు జిల్లా కుణిగల్ కు చెందిన కుమార్ బెంగళూరు చేరుకుని బార్ బెండర్ గా పని చేస్తున్నాడు. ఇతను సుకందకట్ట ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. కుమార్ భార్య ఇప్పుడు నిండు గర్భవతి.
కావేరీ నీరు తమిళనాడుకు విడుదల చెయ్యరాదని డిమాండ్ చేస్తూ సుకందకట్టలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఆ సందర్బంలో ఆందోళనలు సృతిమించడంతో పోలీసులు, మిలటరీ బలగాలు లాఠీలకు పని చెప్పారు.
లాఠీ దెబ్బల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన కుమార్ సమీపంలోని శ్రీగంధ జిమ్ సెంటర్ కట్టడం మీదకు పరుగు తీశాడు. అయితే పోలీసులు, మిలటరీ సిబ్బంది భవనం మీదకు వెళ్లి చిక్కినవారిని చిక్కినట్లు చితకబాదారు.
చిక్కిపోతామని భయపడిన కుమార్ తప్పించుకోవడానికి ప్రయత్నించి మూడు అంతస్తుల భవనం మీద నుంచి కిందకుపడిపోయాడు. తీవ్రగాయాలైన కుమార్ ను లక్ష్మి స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు.
చికిత్స విఫలమై కుమార్ మరణించాడు. విషయం తెలుసుకున్న కుమార్ కుటుంబ సభ్యులు, బంధువులు సుంకదకట్టలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కర్ఫూ అమలులో ఉన్నా వారు లెక్కచెయ్యలేదు.
సమీపంలో వెలుతున్న ట్యాంకుర్ కు నిప్పటించి నిరసన వ్యక్తం చేశారు. నిండుగర్భణి అయిన కుమార్ భార్యకు న్యాయం చెయ్యాలని, ఎవరో చేసిన పనికి కుమార్ బలి అయ్యాడని అతని కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు సుంకదకట్టలో గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు.