వసూళ్లలో వాటా: షిండేVsకేజ్రీవాల్, సామాన్యుడి కష్టాలు
న్యూఢిల్లీ: ఢిల్లీలో మహిళలకు భద్రత లేనప్పుడు తాను మౌనంగా ఉండలేనని, తాము పది రోజుల పాటు ధర్నా చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) అధ్యక్షులు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం అన్నారు. పోలీసుల వసూళ్లలో కేంద్ర హోంమంత్రి షిండేకు వాటా ఉందని ఆరోపించారు. ఢిల్లీ సెంట్రల్ మోట్రో రైల్వే స్టేషన్ వద్ద ఎఎపి ధర్నా చేసింది. ఈ ధర్నాలో కేజ్రీవాల్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడారు. ఢిల్లీ పోలీసులు సామాన్యుల కోసం పని చేయడంలేదన్నారు. మహిళలకు భద్రత లేనప్పుడు తాను మౌనంగా ఉండలేనన్నారు. నిజాయితీ గల పోలీసులపై లంచాలు తీసుకోవాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. నిజాయితీ గల పోలీసులు ధర్నాలో పాల్గొనాలన్నారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా తాము పది రోజుల పాటు ధర్నా చేస్తామన్నారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న పోలీసులను సస్పెండ్ చేయాలని లేదా బదలీ చేయాలని కోరినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పోలీసులకు తెలియకుండా అసాంఘిక కార్యకలాపాలు జరగవన్నారు. పోలీసుల వసూళ్లలో షిండే హస్తముందని ఆరోపించారు. చట్టం అమలులో పోలీసులు విఫలమైతే సామాన్యుడేం కావాలని ప్రశ్నించారు. అంతకుముందు ఆయన కేంద్ర హోంశాఖ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడే ఆయన ధర్నా నిర్వహించారు.
ఓపిక పట్టాలి: షిండే
విచారణ నివేదిక వచ్చే వరకు అరవింద్ కేజ్రీవాల్ ఓపిక పట్టాలని కేంద్రమంత్రి సుశీల్ కుమార్ షిండే సూచించారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై షండే స్పందించారు. విచారణ జరుగుతోందని, రిపోర్ట్ వచ్చిన తర్వాత పోలీసులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఢిల్లీ పోలీసులను రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి తీసుకు రాలేమన్నారు. అరాచకవాది ఎవరో దేశం మొత్తంకు తెలుసునని అన్నారు.
ప్రజల ఇబ్బందులు
ఎఎపి, కేజ్రీవాల్ వ్యవహారంతో ఢిల్లీ ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. వారి ధర్నా నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జాం అయింది. అంతకుముందే ఎఎపి ధర్నా కారణంగా నాలుగు మెట్రో రైల్వే స్టేషన్లను మూసివేశారు. కేజ్రీవాల్ తీరుతో ప్రజలు ట్రాఫిక్ ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తోందని బిజెపి మండిపడగా, అనవసర రాద్దాంతం చేస్తున్నారని కాంగ్రెసు విమర్శించింది.