రైల్లో నటి హ్యాండ్ బ్యాగును కొరికేసిన ఎలుక : రైల్వే మంత్రికి ఫిర్యాదు
ముంబై : రైళ్లలో ఎలుకల బెడద ప్రముఖ మరాఠీ నటి నివేదిత సరాఫ్ కి చేదు అనుభవాన్ని మిగిల్చింది. రైల్లో ప్రయాణిస్తున్న సందర్బంలో ఆమె బ్యాగును ఎలుకలు కొరికేశాయి. అయితే ఈ విషయాన్ని చూసీ చూడనట్టు వదిలేయకుండా రైల్వే దృష్టికి తీసుకెళ్లారు నివేదిత.
గత సెప్టెంబర్ 22న లాటూర్ ఎక్స్ ప్రెస్ లో ఫస్ట్ క్లాస్ బోగిలో ప్రయాణించారు నివేదిత. ఆ సమయంలో తన హ్యాండ్ బ్యాగును తలకిందను పెట్టుకుని నిద్రపోయారు. తీరా నిద్ర లేచి చూసేసరికి తన హ్యాండ్ బ్యాగ్ ను ఎలుకలు కొరికేశాయి. దీంతో రైల్వే నిర్వహణ పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ట్విట్టర్ ద్వారా విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు దృష్టికి తీసుకెళ్లారు.
22 Sept Latur Express A1 27 rat did this to my bag while I was sleeping. bag was near my head. horrible @RailMinIndia @sureshpprabhu pic.twitter.com/9HYJaLKY8d
— Nivedita Saraf (@nivisaraf) September 26, 2016
తన చిరిగిన బ్యాగును ఫోటో తీసి కేంద్రమంత్రి సురేశ్ ప్రభుకు ఇదే విషయాన్ని వివరిస్తూ ట్వీట్ చేశారు. దీంతో నివేదిత ఫిర్యాదుపై స్పందించారు కేంద్ర రైల్వే చీఫ్ పీఆర్వో నరేంద్ర పాటిల్. రైల్వేలను శుభ్రంగా ఉంచడానికి సిబ్బంధి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నారని.. అయితే ప్రయాణికులు తినుబండారాలను రైళ్లలోనే వదిలేసి వెళ్తుండడంతో ఇలాంటి దుస్థితి నెలకొందని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. కాగా, నివేదిత ట్వీట్ ను ఫిర్యాదుగా భావించి ఘటనపై చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారాయన.