భారత్లోకి 20మంది లష్కరే ఉగ్రవాదులు: ఐబీ హెచ్చరిక, అమర్నాత్ యాత్రే లక్ష్యం?
శ్రీనగర్/న్యూఢిల్లీ: అమరనాథ్ యాత్రే లక్ష్యంగా భారత్లోకి ఉగ్రవాదులు ప్రవేశించినట్టు తమ వద్ద సమాచారం ఉందని కేంద్ర నిఘా విభాగం (ఐబీ) వెల్లడించింది. ఐఎస్ఐ సహకారంతో 20 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు భారత్లోకి చొరబడటంతో అమర్నాథ్ యాత్రపై దాడి జరిగే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి.
పీవోకే నుంచి రెండు బృందాలుగా ఉగ్రవాదులు చొరబడినట్టు తమకు సమాచారం అందిందని వెల్లడించాయి. ఐఎస్ఐ సహకారంతో భారత్లోకి ప్రవేశించిన తొలి బృందంలో 11 నుంచి 13 మంది, రెండో బృందంలో ఆరు నుంచి ఏడుగురు ఉగ్రవాదులు ఉన్నట్టు గుర్తించామని వెల్లడించాయి.

సోమవారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ఉన్నతస్థాయిలో జరిగిన కీలక సమావేశం తర్వాత కేంద్ర నిఘా వర్గాలు కొంత సమాచారాన్ని బయటకు వెల్లడించాయి. లష్కరే తోయిబాకు చెందిన 20 మంది ఉగ్రవాదులు పీవోకే నుంచి ప్రవేశించి కంగన్ ప్రాంతంపై దాడి చేసేందుకు వ్యూహం పన్నినట్టు తమ వద్ద సమాచారం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అన్ని చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.
అమర్నాథ్ యాత్ర భద్రతను పర్యవేక్షిస్తున్న ఆర్మీ, ఇతర భద్రతా సంస్థలు కట్టుదిట్టమైన భద్రతతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ప్రత్యేకంగా అమర్నాథ్ యాత్రకు కీలకమైన కంగన్ ప్రాంతంలో అలజడి సృష్టించాలనే దృక్పథంతోనే వారు భారత్లోకి ప్రవేశించినట్టు తెలిసింది.












Click it and Unblock the Notifications