మోడీ అనుచరుడు అమిత్ షా ఉగ్రవాది: లాలూ
పాట్నా: బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ముఖ్య అనుచరుడు అమిత్ షాను రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జెడి) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఉగ్రవాదిగా అభివర్ణించారు. అమిత్ షా ఆజంగఢ్ వ్యాఖ్యలపై ఆయన ఆ విధంగా ఉన్నారు. నరేంద్ర మోడీకి అమిత్ షా కుడిభుజమని, గుజరాత్, ముజఫర్నగర్ అల్లర్ల వెనక హస్తం ఉందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు
నరేంద్ర మోడీ, అమిత్ షా మతహింసతో దేశాన్ని తగులబెడుతారని, వారు పునాదిని కోల్పోయారని, దీంతో నిజమైన రంగును బయటపెట్టుకుంటున్నారని ఆయన అన్నారు. ఆజంగఢ్ ఉగ్రవాదులకు నిలయమని షా చేసిన వ్యాఖ్యలపై లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయోధ్యకు సమీపంలో ఉన్న ఫైజాబాద్ ప్రచార సభలో మోడీ రాముడి చిత్రాన్ని ప్రదర్శించడాన్ని ప్రస్తావిస్తూ ఎన్నికల వాతావరణానికి మతం రంగు పులిమే ప్రయత్నమని ఆయన అన్నారు. రామ్ లేదా రహీంతో బిజెపికి గానీ నరేంద్ర మోడీకి గానీ ఏ విధమైన సంబంధం లేదని ఆయన అన్నారు.
ఎన్నికల వాతావరణానికి మతం రంగు పూయడమే వారి ఉద్దేశ్యమని ఆయన అన్నారు. వారికి ఇది కొత్తేమీ కాదని, చాలా కాలంగా అదే పనిచేస్తున్నారని ఆయన అన్నారు.