పనిలో పనిగా.. కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ, సమస్యలపై విన్నపాలు, వినతిపత్రాలు
ఏపీకి సంబంధించిన పలు సమస్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమత్రి చంద్రబాబునాయుడు మంగళవారం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను, ఇతర పెద్దలను కలిసి వినతి పత్రాలు అందజేశారు.
న్యూఢిలీ/అమరావతి: ఏపీకి సంబంధించిన పలు సమస్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమత్రి చంద్రబాబునాయుడు మంగళవారం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను, ఇతర పెద్దలను కలిసి వినతి పత్రాలు అందజేశారు. ప్రత్యేక ప్యాకేజీ, అటవీభూములు, స్థానికత అంశం.. ఇలా పలు సమస్యలను ఆయన వారి దృష్టికి తీసుకొచ్చారు.
సీట్ల పెంపుపై మోడీ మాటే ఫైనల్: తేల్చిచెప్పిన రాజ్నాథ్, ఇద్దరు 'చంద్రులు' ఆగ్రహం?
మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారానికి హాజరైన ఆయన... అరుణ్ జైట్లీతోపాటు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జావదేకర్లకు ఆయా అంశాలపై వినతి పత్రాలను అందించారు. వీరిలో జావదేకర్, హర్షవర్ధన్, తోమర్ స్వయంగా పార్లమెంటు ఆవరణలోని టీడీపీపీ కార్యాలయానికి వచ్చి చంద్రబాబును కలవడం గమనార్హం.
మూడేళ్లలో రూ.20 వేల కోట్లు కష్టమే...
‘‘ప్రత్యేక హోదా బదులు ఐదేళ్లపాటు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు. మీరు చెప్పిన లెక్కల ప్రకారమే మా రాష్ట్రానికి రూ.20 వేల కోట్లు రావాలి. కేవలం మూడేళ్ల వ్యవధిలో మీరు సూచించిన పద్ధతిలో రూ.20 వేల కోట్లు తీసుకోవడం సాధ్యం కాదు.. అందువల్ల ఇతర మార్గాల్లో ఆ మొత్తాన్ని సర్దుబాటు చేయాలి. అలా చేస్తేనే మీరు ఇచ్చిన హామీలకు విలువ ఉంటుంది'' అని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి తేల్చి చెప్పారు. జైట్లీకి ఇచ్చిన వినతిపత్రంలో సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులను వివరించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన నిధులు, అవి రావడంలో ఉన్న సాధక బాధకాలు... ప్రత్యామ్నాయాలను ఆయన సవివరంగా పేర్కొన్నారు.
Recommended Video
ప్రత్యామ్నాయ మార్గాలు చూడండి...
‘‘ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ద్వారా సహాయం అందించాలని గత ఏడాది కేంద్ర కేబినెట్ తీర్మానించింది. దీనిద్వారా ఐదేళ్లపాటు కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 90 శాతం గ్రాంటు రాష్ట్రానికి అందాలి. మీరు వేసిన లెక్క ప్రకారమే ఐదేళ్లలో రూ.15 వేల కోట్లు రాష్ట్రానికి రావాలి. ఇక... విదేశీ రుణ సంస్థల నుంచి అప్పు తీసుకుని అమలు చేసే ప్రాజెక్టులకు సంబంధించి... 90 శాతం కేంద్రమే భరించాలి. గత రెండేళ్లలో రాష్ట్రానికి వచ్చిన రుణాల ప్రకారం చూస్తే ఐదేళ్లలో కేంద్రం రూ.5 వేల కోట్లు తన వాటాగా భరించాల్సి ఉంటుంది. కానీ... ఇంత భారీ మొత్తాన్ని మిగిలిన మూడేళ్లలో సమీకరించి, ఖర్చు చేయడం సాధ్యం కాదు..'' అని చంద్రబాబు పేర్కొన్నారు.
ఇక ప్రత్యేక ప్యాకేజీ వల్ల లాభమేంటి?
‘‘2015-16 నుంచి 2019-20 మధ్యలో విదేశీ రుణ ప్రాజెక్టులకు తిరిగి చెల్లించాల్సిన రుణాలు, వడ్డీ కింద మాత్రమే సాయం సర్దుబాటు చేస్తామని, ఈ వ్యవధిలో రాష్ట్రం విదేశీ రుణ సంస్థల నుంచి తీసుకునే రుణాలు కూడా ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడి ఉండాల్సిందేనని కేంద్ర ఆర్థిక శాఖ అధికారి ఒకరు ఇటీవల లేఖ రాశారని, ఇది ఎంతమాత్రం సరికాదు. ఇదే విధానం అనుసరిస్తే ప్రత్యేక ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి కలిగే తక్షణ లాభం ఏమిటో మాకు అర్థం కావడంలేదు'' అని చంద్రబాబు జైట్లీకి సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు.
ఏం చేస్తారో .. మీదే బాధ్యత...
ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రాజధాని అమరావతి పనులకు నిధుల సమీకరణకే ఇక్కట్లు పడుతున్నామని... ఉన్న నిధులు విదేశీ రుణాల వడ్డీకే మళ్లిస్తే అభివృద్ధి నిలిచిపోతాయని సీఎం చంద్రబాబు ఆక్రోశించారు. అటువంటి పరిస్థితి ఎదురు కాకుండా చూడాల్సిన బాధ్యత మీపైనే ఉందంటూ జైట్లీకి సూటిగా చెప్పారు. ఐదేళ్లలో కేంద్రం నుంచి రావాల్సిన 20 వేల కోట్లను ఇతర రూపాల్లో సర్దుబాటు చేసి ఆదుకోవాలని కోరారు. దానికి ఆయన కొన్ని ప్రతిపాదనలు కేంద్రం ముందు ఉంచారు.
పోనీ, ఇలాగైనా చేయండి....
కేంద్ర ప్రాయోజిత పథకాలు, విదేశీ రుణ ప్రాజెక్టుల కింద రావాల్సిన రూ. 20 వేల కోట్లను రాష్ట్రానికి ఇచ్చే ప్రత్యేక ఆర్థిక సాయంగా కేంద్రం పరిగణించాలి. విదేశీ రుణ ప్రాజెక్టులు, నాబార్డ్, చిన్న పొదుపు మొత్తాల కింద గతంలో తీసుకున్న రుణాలను ఈ మొత్తం ద్వారా తీర్చివేయడానికి రాష్ట్రానికి అనుమతి ఇవ్వాలి. విదేశీ రుణ ప్రాజెక్టుల నుంచి ఇంత తక్కువ వ్యవధిలో ఎక్కువ మొత్తం రుణం తీసుకోవడం సాధ్యం కాదు కాబట్టి రాష్ట్రానికి రావాల్సిన మేర స్ధానిక రుణ దాతలైన నాబార్డ్, హడ్కో, వాణిజ్య బ్యాంకుల నుంచి రుణం తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలి. వివిధ పద్దుల కింద కేంద్రానికి రాష్ట్రం చెల్లించాల్సిన రుణాలు, వడ్డీలను ఈ పద్దు కింద కేంద్రం సర్దుబాటు చేసి కొంత ఉపశమనం కలిగించాలి. కేంద్రం ఇచ్చే ప్రత్యేక ఆర్థిక సాయాన్ని రాష్ట్రానికి సంబంధించిన ఎఫ్ఆర్బీఎం పరిమితికి సంబంధం లేనిదిగా పరిగణించాలి.
పోలవరానికీ నిధులివ్వండి...
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు ఇవ్వాలని కూడా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని చంద్రబాబు కోరారు. ‘‘పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత కేంద్రం రూ.3349.70 కోట్లను రాష్ట్రానికి తిరిగి చెల్లించిందని, ఇంకా... 3808.83 కోట్లు ఇవ్వాల్సి ఉందని, రూ.3793 కోట్లను రాష్ట్రానికి ఇవ్వాలని కేంద్ర జల వనరుల శాఖ నాబార్డుకు ప్రతిపాదించిందని, దీనిని వెంటనే ఆమోదించి, నిధులు విడుదల చేయండి'' అని జైట్లీని చంద్రబాబు కోరారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా 2018 జూన్ నాటికి గ్రావిటీ పద్ధతిలో నీళ్లు ఇవ్వాలని, మొత్తం ప్రాజెక్టును 2019 జూన్ నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని కూడా ఆయన జైట్లీ దృష్టికి తీసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో విభాగాల వారీగా పనుల పురోగతిని కూడా చంద్రబాబు నాయుడు వివరించారు.
ఫైనాన్సియల్ కార్పొరేషన్ను ఏర్పాటుకు సహకరించండి...
మరోవైపు, రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్ 9లో ఉన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ను రెండు రాష్ట్రాల మధ్య విభజించాల్సి ఉండగా, తెలంగాణ ప్రభుత్వం సొంతంగా ఈ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసుకుందని, ఈ క్రమంలో ఏపీలో కూడా స్టేట్ ఫైనాన్సియల్ కార్పొరేషన్ను ఏర్పాటుకు సహకరించాలని కూడా చంద్రబాబు నాయుడు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కోరారు.
స్థానికత గడువు పెంచండి...
ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను ఆయన నివాసంలో కలిశారు. తెలంగాణ నుంచి నవ్యాంధ్రకు వచ్చి స్థిరపడే వారికి ఏపీ స్థానికత ఇచ్చే గడువు ఈ ఏడాది జూన్ 2తో ముగిసిందని... దీనిని మరో రెండేళ్లు పొడిగించాలని కోరారు. విద్యా సంస్థల్లో పిల్లల చదువులు, ఉద్యోగాల నేపథ్యంలో చాలామంది ఇంకా తెలంగాణలో ఉన్నారని... 9, 10 షెడ్యూళ్లలో ఉన్న సంస్థల ఉద్యోగులు కూడా రాలేదని, వీరందరికీ వెసులుబాటు కలిగేలా 2019 జూన్ 1లోపు నవ్యాంధ్రలో స్థిరపడే వారికి స్థానికత వచ్చేలా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని కోరారు.
ఇళ్లపై మాకే అధికారమివ్వండి...
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇళ్లకు అర్హులను నిర్ణయించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ను చంద్రబాబు కోరారు. ‘‘గ్రామసభల్లో స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి, వాటిని మంజూరు కోసం కేంద్రానికి పంపడంతో ఆలస్యం జరుగుతోంది. 2011లో చేసిన సామాజిక ఆర్థిక జనగణన సర్వే ప్రకారం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన స్మార్ట్ పల్స్ సర్వే ఆధారంగా ఇళ్లు మంజూరు చేసే అవకాశం మాకే ఇవ్వండి'' అని కోరారు. స్మార్ట్ పల్స్ సర్వేలో పకడ్బందీ సమాచారం ఉందని తెలిపారు. ఇళ్ల నిర్మాణంలో అనుకున్న లక్ష్యం సాధించాలంటే రాష్ట్రానికి ఏటా 2 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని ప్రతిపాదించారు. మొత్తం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు 30 లక్షల ఇళ్లు అవసరమని చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే... ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.1951 కోట్ల పెండింగ్ నిధులను విడుదల చేయాలని కూడా మంత్రి తోమర్ను ఆయన కోరారు.
విద్యా సంస్థలను... త్వరగా పూర్తి చేయండి
ఏపీలో ఏర్పాటు చేస్తున్న జాతీయ స్థాయి విద్యా సంస్థలను త్వరగా పూర్తి చేయాలని మంత్రి ప్రకాశ్ జావదేకర్ను సీఎం చంద్రబాబు కోరారు. ఇప్పటి వరకు మంజూరు చేసిన విద్యా సంస్థల పురోగతి, నిధులు విడుదల, కేంద్ర ప్రభుత్వ హామీలతో కూడిన నివేదికను ఆయనకు అందించారు. ఐఐటీ (తిరుపతి)కి కేంద్రం నుంచి ఇంకా 62 కోట్లు విడుదల కావాల్సి ఉందన్నారు. ఐఐఎస్ఆర్ (తిరుపతి)కి రూ.60.5 కోట్లు, ఐఐఎం (విశాఖ)కు 52 కోట్లు, ఎన్ఐటీ (తాడేపల్లిగూడెం) 50 కోట్లు, ఐఐఐటీ (కర్నూలు)కు 40 కోట్లు, కేంద్రీయ విశ్వవిద్యాలయానికి (అనంతపురం) 10 కోట్లు విడుదల కావాల్సి ఉందని తెలిపారు. అలాగే... గిరిజన విశ్వవిద్యాలయం (విజయనగరం) కోసం రూ.10 కోట్లు ఇవ్వాల్సి ఉందని తెలిపారు.
రాజధానికి 12,444 హెక్టార్ల అటవీభూమి కావాలి...
నూతన రాజధాని అమరావతి నగర నిర్మాణానికి 12,444 హెక్టార్ల అటవీభూమిని కేటాయించాలని పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్ను చంద్రబాబు అభ్యర్థించారు. ‘‘దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది. గత నెలలో మూడు రోజులపాటు నిపుణుల కమిటీ కూడా రాష్ట్రానికి వచ్చి పర్యటించింది. సీఆర్డీఏ అధికారులతోనూ చర్చించింది. అటవీ భూముల డీనోటిఫికేషన్పై త్వరగా అనుమతులు ఇవ్వండి'' అని ఆయన మంత్రిని కోరారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో పారిశ్రామిక జోన్ ఏర్పాటుకు కూడా అటవీ భూములు ఇప్పించాలని కోరారు.
బారైట్ ప్లాంటు ఏర్పాటుకు అనుమతివ్వండి...
రాష్ట్రంలో బారైట్ బెనిఫికేషన్ ప్లాంటు ఏర్పాటుకు అనుమతించాలని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కూడా చంద్రబాబు కోరారు. ఓఎన్జీసీ డ్రిల్లింగ్ ఆపరేషన్లకు 4.10 స్పెసిఫిక్ గ్రావిటీ బారైట్ పొడి సరఫరా చేసేందుకు వీలుగా బెనిఫికేషన్ ప్లాంటును సంయుక్తంగా ఏర్పాటు చేయడానికి 2015లో ఓఎన్జీసీ, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మధ్య ఒక ఒప్పందం కుదిరిందని, దీనికి సంబంధించిన అనుమతుల ప్రతిపాదనలు ఇప్పటికీ కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. బెనిఫికేషన్ ప్లాంటుతో స్థానికులకు ఉపాధి లభించడమే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థకు మంచి ఆదాయం వస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. మరోవైపు... ఓఎన్జీసీ నుంచి రూ.571.20 కోట్ల రాయల్టీ రాష్ట్రానికి రావాల్సి ఉందని తెలిపారు. కనీసం ఆ నిధులనైనా త్వరగా ఇప్పించాలని కోరారు.