సీట్ల పెంపుపై మోడీ మాటే ఫైనల్: తేల్చిచెప్పిన రాజ్నాథ్, ఇద్దరు ‘చంద్రులు’ ఆగ్రహం?
అసెంబ్లీ సీట్ల పెంపుపై రాజకీయ నిర్ణయం తీసుకున్న తరువాతే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడతామని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్సింగ్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో తేల్చి చెప్పారు.
న్యూఢిల్లీ: అసెంబ్లీ సీట్ల పెంపుపై రాజకీయ నిర్ణయం తీసుకున్న తరువాతే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడతామని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్సింగ్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో తేల్చి చెప్పారు.
ఈ విషయమై తెలంగాణ ముఖ్యమత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం రాజ్నాథ్తో విడివిడిగా భేటీ అయ్యారు. అసెంబ్లీ సీట్ల పెంపునకు సంబంధించి హోంశాఖ బిల్లును తయారు చేసిందని.. ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాల నుంచి గ్రీన్సిగ్నల్ వస్తే ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెడతామని రాజ్నాథ్ స్పష్టం చేశారు.

ఎంపీలతో చెప్పిందే.. సీఎం కేసీఆర్ తో..
రెండు రోజుల క్రితం తనను కలిసిన టీఆర్ఎస్ ఎంపీలతో కూడా రాజ్నాథ్ ఇదే విషయాన్ని చెప్పినట్లు సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేత జితేందర్ రెడ్డి, ఎంపీ వినోద్తో కలిసి హోం మంత్రి రాజ్నాథ్సింగ్తో భేటీ అయి దాదాపు 30 నిమిషాలు మాట్లాడారు. అనంతరం కేసీఆర్.. విలేకరులతో ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు.
Recommended Video


గట్టిగానే అడిగా, అవసరమైతే...
మరోవైపు.. సీట్ల పెంపుపై రాజ్నాథ్తో గట్టిగా ప్రస్తావించామని, అవసరమైతే అమిత్షా, మోడీలతో కూడా మాట్లాడతామని చంద్రబాబు విలేకరులకు తెలిపారు. మంగళవారం అమిత్షాను కలవడానికి చంద్రబాబు ప్రయత్నించినా సమయాభావం కారణంగా కలవలేకపోయారు. దీంతో త్వరలోనే మళ్లీ ఢిల్లీకి వచ్చి మోడీ, షాలతో ప్రత్యేకంగా భేటీ కావాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. నిజానికి ఈ అసెంబ్లీ సీట్ల పెంపుపై చంద్రబాబు గతంలో కూడా చాలాసార్లు అమిత్ షాతో చర్చించారు.

అప్పుడేమో అలా చెప్పి... ఇప్పుడేమో...
అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం మాట మార్చినట్లే కనిపిస్తోంది. గతంలో న్యాయశాఖ సలహాలు తీసుకోవాలని ఒకసారి.. బిల్లును తయారు చేయాలని మరోసారి.. రాజ్యాంగాన్ని సవరించాలా? లేదా? అనే అంశంపై చర్చ జరగాలంటూ ఇంకోసారి.. ఇలా బీజేపీ అధిష్ఠానం పలుమార్లు పలు రకాలుగా తెలిపింది. ఎట్టకేలకు.. సీట్ల పెంపునకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ని సవరించాలని స్పష్టం చేసిన న్యాయశాఖ, ఆ మేరకు బిల్లును కూడా సిద్ధం చేసి కేంద్ర హోం శాఖకు పంపించింది. కేబినెట్లో ప్రవేశపెట్టడానికి నోట్ను కూడా సిద్ధం చేసిన హోంశాఖ.. పీఎంవో గ్రీన్సిగ్నల్ కోసం వేచి చూస్తోంది. ఈ తరుణంలో.. రాజకీయ నిర్ణయం తీసుకోవాలంటూ మెలిక పెట్టడంపై ఇద్దరు చంద్రులు కొంత ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం.

వారే మోకాలడ్డుతున్నారా?
అసెంబ్లీ సీట్ల పెంపు బిల్లుకు తెలంగాణ బీజేపీ నేతలే అడ్డుపడుతున్నారనే వారు భావిస్తున్నారు. సీట్ల పెంపు వల్ల తెలంగాణలో టీఆర్ఎస్ కే లాభం చేకూరుతుందని, సీట్లు పెంచితే టీడీపీ, కాంగ్రెస్ ల్లో మిగిలిన నేతలు టీఆర్ఎస్ లో చేరతారని.. సీట్లు పెంచకపోతే వచ్చే ఎన్నికల్లో వారంతా కమలం వైపు మొగ్గు చూపే అవకాశముందని తెలంగాణ బీజేపీ నేతలు అధిష్ఠానానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం.

ఏపీలో వైసీపీ కూడా...?
మరోవైపు ఏపీలో వైసీపీ కూడా సీట్ల పెంపుపై అభ్యంతరాలను లేవదీసిందని, అందుకే బీజేపీ తాత్సారం చేస్తోందన్న వాదనా వినిపిస్తోంది. మోడీ, అమిత్ షా సీట్ల పెంపునకు ప్రాధాన్యం ఇవ్వట్లేదని.. ఒకవేళ సీట్లు పెంచితే ఏపీలో పెరిగే 50 అసెంబ్లీ సీట్లను తమకే ఇవ్వాలని, ఆ మేరకు ఎంపీ సీట్లనూ ఇవ్వాలని బీజేపీ అధిష్ఠానం డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications