అయోధ్య జడ్జిమెంట్ లో కొత్త కోణం: ఏకాభిప్రాయంతోనే నిర్ణయం: అసలు ఈ తీర్పు రాసిందెవరు..!
సుప్రీంకోర్టు అయోధ్యపైన సంచలన తీర్పు ఇచ్చింది. అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసం ఏకాభిప్రాయంతో ఇచ్చిన తీర్పు చరిత్రలో నిలిచిపోతుంది. దేశం మొత్తం ఆసక్తిగా చూసిన ఈ తీర్పులో కొత్త అంశం బయటకు వచ్చింది. అయోధ్య కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ అశోక్భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం విచారించింది. తుది తీర్పులో భాగంగా..కోర్టుహాల్లో 1045 పేజీలున్న తుది తీర్పులోని కీలక అంశాలను జస్టిస్ గొగోయ్ చదివి వినిపించారు. తీర్పుతో పాటు 116 పేజీల అనుబంధాన్ని కూడా ప్రత్యేకంగా ఇవ్వడం ఈ తీర్పులోని మరో విశేషం. అయోధ్యలోని ప్రస్తుత వివాదాస్పద స్థలమే శ్రీరాముడి జన్మస్థలమని విశ్వసించేందుకు ఆధారాలేంటనే విషయాన్ని కూలంకశంగా ఆ అనుబంధంలో వివరించారు.
తీర్పు రాసిందెవరు..
సాధారణంగా తీర్పు వెలువరించే సమయంలో ధర్మాసనం తరఫున ఆ తీర్పును రాసిన న్యాయమూర్తి ఎవరో కూడా ప్రకటిస్తారు. ఒకరికి మించిన న్యాయమూర్తులు సభ్యులుగా ఉన్న ధర్మాసనాలు తీర్పు ఇచ్చే సమయంలో తీర్పును రాసిన జడ్జీ పేరును ప్రకటించడం సంప్రదాయం. కానీ అయోధ్య తీర్పు విషయంలో ఈ సంప్రదాయాన్ని పాటించకపోవడం విశేషం. ధర్మాసనంలో ఎంతమంది న్యాయమూర్తులున్నా.. తీర్పును అందులో ఎవరో ఒకరే రాస్తారు. భిన్నాభిప్రాయాలు ఉన్న న్యాయమూర్తులు ప్రత్యేక తీర్పునివ్వటం ఆనవాయితీ. తాజా తీర్పును ఏకాభిప్రాయంతో వెల్లడించినా.. దాన్ని ఎవరు రాసారనే అంశాన్ని మాత్రం ఎక్కడా పొందుపర్చలేదు. తీర్పు చివరిలో మాత్రం కేసు విచారించిన ప్రధాన న్యాయమూర్తితో పాటుగా మిగిలిన నలుగురు న్యాయమూర్తుల పేర్లు ఉన్నాయి.

తొంగి చూసిన అసమ్మతి..!
అయిదుగురు న్యాయమూర్తులు ఏకాభిప్రాయంతో తీర్పు ఇచ్చినా..అందులో ఒక న్యాయమూర్తి ఆ స్థలం రామజన్మభూమే అని స్పష్టంగా చెబుతూ పేర్కొన్నారు. అయితే ఆ విధంగా స్పందించిన న్యాయమూర్తి ఎవరనేది మాత్రం ప్రస్తావించలేదు. ఈ విషయంలో ఆయన రాసిన 116 పేజీల తీర్పును అనుబంధంగా పొందపరిచారు. కేసు సున్నితమైనది కావటంతో అందులో పేర్లు వెల్లడించలేదనని నిపుణులు భావిస్తున్నారు. ఏది ఏమైనా సుదీర్ఘ వివాదంగా కొనసాగుతున్న సున్నితమైన అంశానికి సుప్రీం తన తీర్పుతో ముగింపు పలికింది.












Click it and Unblock the Notifications