మోడీ ప్రధాని కావాలి: రాహుల్ ఇన్నోసెంటన్న రాందేవ్
ముంబై: దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు ప్రముఖ యోగా గురువు బాబు రాందేవ్ తెలిపారు. ఆయన మహారాష్ట్రలోని ముంబైలోని వర్లీ జంబోరి మైదానంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు. దేశంలోని దళిత, ఆదివాసీ బడుగుబలహీన వర్గాల ప్రజలంతా మోడీని ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నారని అన్నారు.
ఇటీవల వివిధ సంస్థలు నిర్వహించిన అన్ని సర్వేల్లోనూ బిజెపి గెలుపు స్పష్టమైందని రాందేవ్ తెలిపారు. నరేంద్ర మోడీని ప్రధాని చేయడమే లక్ష్యంగా తమ కార్యకర్తలు దేశ వ్యాప్తంగా ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. దేశం నలుమూలాల ప్రజాభిమానం పొందిన నరేంద్ర మోడీ ముందు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చిన్న పిల్లవాడని విమర్శించారు.
రాహుల్ గాంధీకి అంతగా జ్ఞానం లేదని, అతడు ఇంకా పరిపక్వత సాధించలేదని తెలిపారు. అతడో అమాయక బాలుడని, అతన్ని కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. అలాంటి వ్యక్తితో దేశానికి ఎలాంటి ప్రయోజనం లేదని రాందేవ్ తెలిపారు. ప్రధానికి ఉండాల్సిన అర్హతలు రాహుల్ గాంధీకి లేవని చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని దేశంలోని 15శాతం ప్రజలు కూడా కోరుకోవడం లేదని బాబా రాందేవ్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికల్లో ప్రజలు తిరస్కరిస్తారని, ఆ పార్టీకి 50 సీట్లు కూడా రావని రాందేవ్ తెలిపారు. గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనింపజేస్తున్న నరేంద్ర మోడీయే ప్రధాని పదవికి అర్హుడని స్పష్టం చేశారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సామాన్యుల కష్టాలను తీరుస్తుందని బాబా రాందేవ్ చెప్పారు.