దేశవ్యాప్తంగా బ్యాంకుల బంద్, స్తంభించిపోయిన లావాదేవీలు, ఏటీఎంల వద్ద జనం బారులు
పే స్కేల్లో 20 శాతం వేతన సవరణ చేయాలని బ్యాంకు యూనియన్లు నేటి నుంచి సమ్మె చేపడుతున్నాయి. శుక్ర, శనివారాలు రెండురోజులు బ్యాంక్ సేవలు నిలిచిపోనున్నాయి. 2020-2021 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సర్వే, బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బ్యాంకు సంఘాలు సమ్మె చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. బ్యాంకులు పనిచేయకపోవడంతో వినియోగదారులు ఏటీఎంల మీద ఆధారపడతారు.
సమ్మె తప్పలేదు..
యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ (యూఎఫ్బీయూ) ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్పెడరేషన్ నేతృత్వంలోని 9 బ్యాంకులు (ఏఐబీవోసీ) ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయ్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ (నేవోబీడబ్ల్యూ) యూనియన్లు ప్రకటించాయి. బ్యాంకు సంఘాలు సమ్మె చేస్తామని ప్రకటించిన వెంటనే ముఖ్య కార్మిక కమిషనర్ చర్చలు జరిపారు.. కానీ వేతన సవరణపై హామీ రాకపోవడంతో సమ్మెకు వెళ్తున్నామని ఏఐబీవోసీ అధ్యక్షుడు సునీల్ కుమార్ తెలిపారు.
కొత్త పెన్షన్ రద్దు..?
2017 నవంబర్ నుంచి వేతన సవరణ చేయడం లేదని ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకు యూనియన్లు గుర్తుచేస్తున్నాయి. దీంతోపాటు కొత్త పెన్షన్ విధానాన్ని కూడా రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ పే స్కేల్పై 20 శాతం శాలరీ పెంచాలని.. వారంలో ఐదు రోజులకు మించి పనిచేసినవారికి బేసిక్ శాలరీ స్పెషల్ అలవెన్స్ ఇవ్వాలని కోరుతున్నాయి.
యాజమాన్యమే కారణం..?
తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం తీర్చకపోవడంతో సమ్మెకు వెళుతున్నామని ఇండియన బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం పేర్కొన్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడంతోనే సమ్మె చేస్తున్నామని, తమ ఇబ్బందులను ఖాతాదారులు గమనించాలని సూచించారు. దీనికి కారణం తాము కాదని కేంద్ర ప్రభుత్వం, బ్యాంకు యాజమాన్యామేనని స్పష్టంచేశారు.
10వ తేదీన కూడా
తమ వేతనాలు 2017 అక్టోబర్లో 15 శాతం మాత్రమే పెంచారని బ్యాంకు యూనియన్లు గుర్తుచేస్తున్నాయి. అప్పటినుంచి వేతనాల ఊసేలేదని పేర్కొన్నారు. ఈ నెల 8వ తేదీన 10 ప్రధాన వాణిజ్య యూనియన్ బ్యాంకులు కూడా ప్రజా వ్యతిరేక విధానాలపై సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే.