దేశంలో పుట్టుకొస్తున్న కొత్త కేసులు: రాకెట్ స్పీడ్: ఒక్కరోజే 75 వేలకు పైగా: 60 వేల మంది బలి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మరణ మృదంగాన్ని మోగిస్తోంది. కరోనా మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వేల సంఖ్యలో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. ఇదివరకు ఎప్పుడూ లేనివిధంగా కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. అన్లాక్ తరువాతే కరోనా కొత్త కేసుల్లో రికార్డు స్థాయిలో పెరుగుదల చోటు చేసుకుంటోంది. కరోనా కేసుల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న అమెరికాలోనూ ఒక్కరోజు వ్యవధిలో ఈ స్థాయిలో పెరుగుదల ఎప్పుడూ కనిపించలేదు. ఇదే వేగం మరి కొంతకాలం పాటు కొనసాగితే.. భారత్ ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసుల జాబితాలో రెండో స్థానాన్ని ఆక్రమించుకోవడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు.
తెలంగాణలో బెంబేలెత్తిస్తోన్న కరోనా: వరుసగా రెండో రోజూ: కోలుకోవట్లేదు: లోయెస్ట్ డిశ్చార్జీలు
దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 75,,760 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1023 మంది మరణించారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 33,10,235కు చేరుకుంది. ఇప్పటిదాకా 60,472 మంది మరణించారు. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 7,25,991కు చేరుకుంది. 25,23,772 మంది డిశ్చార్జి అయ్యారు. దీనికి సంబంధించిన వివరాలతో కూడిన తాజా బులెటిన్ను కొద్దిసేపటి కిందటే కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు విడుదల చేశారు.
75 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం దేశంలో ఇదే తొలిసారి కావడం ఆందోళనకు గురి చేస్తోంది. ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఏ మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. కరోనాను నియంత్రించడానికి తీసుకుంటోన్న చర్యలేవీ పెద్దగా ఉపకరించిన దాఖలాలు లేవనేది దీనితో స్పష్టమౌతోంది. మాస్కులను ధరించకపోవడం, శానిటైజర్లను వినియోగించపోవడం, భౌతిక దూరాన్ని పాటించకపోవడం వంటి చర్యల వల్లే దేశంలో కరోనా కేసులు అదుపులోకి రావట్లేదంటూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఎందుకు ఆందోళన వ్యక్తం చేసిందనేది దీనితో రుజవవుతోంది.
Recommended Video
దేశంలో కరోనా వైరస్ పరీక్షలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్లు మూడు కోట్లను దాటేశాయి. ఇప్పటిదాకా 3,85,76,510 శాంపిళ్లను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది. బుధవారం ఒక్కరోజులో 9,24,998 కరోనా శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటకల్లో కరోనా శాంపిళ్ల పరీక్షలు పెద్ద సంఖ్యలో కొనసాగుతున్నాయి. ఈ అయిదు రాష్ట్రాలూ టాప్ ప్లేస్లో ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో కరోనా రోజువారీ పాజిటివ్ కేసుల్లో వేల సంఖ్యలో నమోదవుతున్నాయి.