ఆందోళన: వారణాసిలో బిజెపి, ఆప్ కార్యకర్తల ఘర్షణ
వారణాసి: భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ర్యాలీకి ఎన్నికల సంఘం అనుమతించని కారణంగా ఆ పార్టీ కార్యకర్తలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం బయట లంక చౌక్లో ఆందోళన చేపట్టారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు అరవింద్ కేజ్రివాల్కు మద్దతుగా నినాదాలు చేయడంతో ఇరు పక్షాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.
ఆప్ కార్యకర్తలను బిజెపి కార్యకర్తలు అక్కడ్నుంచి పంపించే ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య కాసేపు తోపులాట జరిగింది. ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంటుండటంతో రంగంలోకి దిగిన పోలీసులు, పారామిలిటరీ దళాలు ఇరువర్గాలను శాంతింపజేశాయి. ఇరువర్గాలను అక్కడ్నుంచి పంపించే ప్రయత్నం చేశారు.
కొంతసేపటికి ఆప్ మద్దతుదారులు అక్కడ్నుంచి వెళ్లిపోయారు. కాగా, అంతకుముందు బిజెపి సీనియర్ నాయకులు అరుణ్ జైట్లీ, అనంత కుమార్, అమిత్ షా భారీగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలతో ఆందోళన నిర్వహించారు. వారణాసిలో నరేంద్ర మోడీ ర్యాలీకి అనుమతించని కారణంగా ఎన్నికల కమిషన్, రిటర్నింగ్ అధికారులకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.
మధ్యాహ్నం 2 గంటల వరకు బిజెపి నాయకులు, కార్యకర్తలు తమ ఆందోళనను కొనసాగించారు. నరేంద్ర మోడీ ర్యాలీకి ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించడంతో మోడీ సభ కోసం గురువారం ఏర్పాట్లు చేసిన వివిధ కార్యక్రమాలను బిజెపి రద్దు చేసుకుంది.