దేశంలో దుశ్శాసన రాజ్యం- బీజేపీ దుశ్శాసనుల కర్మాగారం-మమత తీవ్ర వ్యాఖ్యలు
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీని ఎట్టి పరిస్ధితుల్లో అదికారం చేపట్టకుండా అడ్డుకునే క్రమంలో మమతా బెనర్జీ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కాలి గాయంతోనే ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న మమత.. వీల్ఛైర్లో కూర్చునే బీజేపీపై నిప్పులు చెరుగుతున్నారు.
మమతా బెనర్జీ మేనిఫెస్టోలో వైఎస్ జగన్ స్కీమ్: ఒకటో తేదీ నాడే: తృణమూల్ ఓటుబ్యాంక్
బెంగాల్లోని జార్ఘ్రామ్ జిల్లాలోని గోపాల్ వల్లవ్పూర్లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న మమతా బెనర్జీని బీజేపీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో దుశ్సాసనుల రాజ్యం కొనసాగుతుందని, బీజేపీ దుశ్సాసనుల కర్మాగారంగా మారిపోయిందని మమత వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశం దృష్టి బెంగాల్పైనే ఉందని, బీజేపీ ఎలా ఓడిపోతుందో దేశం చూడాలనుకుంటుందని మమత తెలిపారు. ప్రధాని మోడీ తాజా ర్యాలీలో మమతపై విమర్శలు చేసిన నేపథ్యంలో బెంగాల్ సీఎం ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
సామాన్య ప్రజలకు కరోనా వ్యాక్సిన్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని, ఎందుకంటే అది తమ చేతుల్లో లేని వ్యవహారమని మమత తెలిపారు. అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రాన్ని అడిగానని, ఖర్చంతా తాను భరిస్తానని చెప్పినా ప్రధాని ఇవ్వడం లేదని మమత ఆరోపణలు చేశారు. ప్రస్తుతం కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయని, అయినా కేంద్రం కరుణించడం లేదని మమత తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.