‘రైతులకు ఆత్మహత్యలు చేస్కోవడం ఫ్యాషనైపోయింది’
ముంబై: రైతులకు ఆత్మహత్యలు చేసుకోవడం ఫ్యాషన్ అయిపోయిందంటూ భారతీయ జనతా పార్టీ ఎంపీ గోపాల్ శెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు మహారాష్ట్రలో 124మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు వచ్చిన నివేదిక నేపథ్యంలో ఎంపీ శెట్టి పైవిధంగా పేర్కొన్నారు.
ఈ ఆత్మహత్యలన్నీ నిరుద్యోగం, పేదరికం కారణంగానే జరగడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదొక ఫ్యాషన్ ట్రెండ్లా కొనసాగుతోందన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం కింద రూ.5లక్షలు ఇస్తే.. పక్క రాష్ట్రం రూ.7లక్షలు ఇస్తుందని ఆయన అన్నారు.
రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని అన్నారు. కాగా, ఎంపీ వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. రైతులు పంటలు విఫలమై, అప్పులతో ఆత్మహత్య చేసుకుంటోంటే వారి గురించి ఇంత దారుణంగా మాట్లాడటం అన్యాయమని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ నిరుపమ్ అన్నారు.
అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ఎంపి గోపాల్ శెట్టి తాను చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని, తనను క్షమించాలని కోరారు.












Click it and Unblock the Notifications