బీబీఎంపీ ఎన్నికలకు బ్రేక్: బెంగళూరును చీల్చేద్దాం
బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ)ఎన్నికలు ఆలస్యంగా జరపడానికి కర్ణాటక ప్రభుత్వానికి అవకాశం చిక్కింది. గడువు పూర్తి అయిన వెంటనే బీబీఎంపీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఏక సభ్య బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను రద్దు చేస్తున్నామని హైకోర్టు ద్వి సభ్య బెంచ్ తీర్పు చెప్పింది.
బీబీఎంపీ కార్పొరేటర్లు సీకే. రామమూర్తి, సోమశేఖర్ తదితరులు గడువులోపు బీబీఎంపీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టును ఆశ్రయించారు. అర్జీ విచారణ చేసిన హైకోర్టు ఏక సభ్య బెంచ్ మే 30వ తేది లోపు బీబీఎంపీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
బెంగళూరును విభజిస్తున్నామని, ఎన్నికలు నిర్వహించడానికి సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అర్జీ సమర్పించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.హెచ్. వఘేలా, రామమోహనరెడ్డి నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ విచారణ చేపట్టింది.
శుక్రవారం ఏకసభ్య బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టి వేస్తున్నామని హై కోర్టు ద్విసభ్య బెంచ్ తీర్పు చెప్పింది. తాము సుప్రీం కోర్టుకు వెళుతామని కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం, బీజేపీ నాయకుడు ఆర్. అశోక్ అన్నారు. మాజీ ముఖ్య మంత్రి, జేడీఎస్ నాయకుడు కుమారస్వామి మాట్లాడుతూ తాము న్యాయపోరాటం చేస్తామని చెప్పారు.
మొత్తం మీద ఈ తీర్పుతో సిద్దరామయ్య ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. ఎన్నికలు నిర్వహించడానికి ఆరు నెలల సమయం చిక్కిందని అంతలోపు బెంగళూరును చీల్చేద్దామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.