కేబినెట్ ఆమోదం: 12న రాజ్యసభలో టీ బిల్లు
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మరో కీలక ఘట్టం ముగిసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. శుక్రవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రారంభమైన మంత్రి వర్గ సమావేశం రెండు గంటల పాటు జరిగింది.
ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో తెలంగాణ బిల్లుపై వాడివేడి చర్చ జరిగింది. సీమాంధ్రకు చెందిన పళ్లం రాజు, కావూరి సాంబశివరావు హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని సూచించారు. వారి సూచనలను మంత్రివర్గ సమావేశం తిరస్కరించింది. తెలంగాణ బిల్లుపై ఆ ఇద్దరు మంత్రులు కూడా తీవ్ర అభ్యంతరం తెలిపారు.

కాగా, ఉత్తరాంధ్రకు చెందిన కిశోర్ చంద్రదేవ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిగిలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్నాన్ని రాజధానిగా చేయాలని సూచించారు. రాయలసీమకు ప్యాకేజీ ఇవ్వాలని కూడా ఆయన సూచించారు. ఈ సమావేశంలో తెలంగాణకు చెందిన ఎస్ జైపాల్ రెడ్డి కూడా పాల్గొన్నారు. యుపిఎ -1, యుపిఎ -2 ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ఇవ్వాల్సిందేనని కేంద్ర మంత్రి, ఎన్సీపి నేత శరద్ పవార్ అన్నారు. హైదరాబాద్ శాంతిభద్రతలను గవర్నర్కు అప్పగించడంపై ఆయన అభ్యంతరం తెలిపారు.
మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులు ఎవరి దారిన వారు వెళ్లిపోగా, ఆ తర్వాత ప్రారంభమైన కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశంలో సోనియా గాంధీతో పాటు సుశీల్ కుమార్ షిండేతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దీంతో కోర్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత సుశీల్ కుమార్ షిండే మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే, ప్రఫుల్ పటేల్ మాత్రం బిల్లుకు ఆమోదం లభించిందనే విధంగా సంకేతాలు ఇచ్చి వెళ్లిపోయారు.
మంత్రివర్గ సమావేశం తర్వాత కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతను కోర్ కమిటీ సమావేశం జరిగింది. తెలంగాణ బిల్లుకు సంబంధించిన కార్యాచరణను ఈ సమావేశంలో ఖరారు చేశారు. రేపు మంత్రివర్గం ఆమోదించిన బిల్లును రాష్ట్రపతికి పంపించే అవకాశం ఉంది. శాసనసభకు పంపించిన బిల్లునే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కోర్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 12వ తేదీన బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మొత్తం 32 సవరణలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రతిపాదించే అవకాశం ఉంది.
రాయల తెలంగాణ ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం తిరస్కరించింది. హైదరాబాదును యుటిగా చేయాలనే సీమాంధ్ర మంత్రుల సూచనను మంత్రివర్గం తిరస్కరించింది. రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ఏ మేరకు ప్యాకేజీలు ఇస్తారనే విషయంపై కూడా నిర్ణయానికి రాలేదు. ఆర్థికాంశాలను ఎక్కువగా జోడించకుండా మంత్రివర్గం జాగ్రత్తలు తీసుకుంది.












Click it and Unblock the Notifications