శశికళపై ఇంటెలిజెన్స్ కన్ను!: జయని కలవనీయలేదు, అదే ఆమెకు పెద్ద సవాల్
జయలలిత మృతి నేపథ్యంలో అన్నాడీఎంకేను ఒక్కతాటి పైన ఎవరు ఉంచుతారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే అన్నాడీఎంకే పైన మూడు ముక్కలాట కొనసాగుతోందని అంటున్నారు.
చెన్నై: జయలలిత మృతి నేపథ్యంలో అన్నాడీఎంకేను ఒక్కతాటి పైన ఎవరు ఉంచుతారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే అన్నాడీఎంకే పైన మూడు ముక్కలాట కొనసాగుతోందని అంటున్నారు. ఓ వైపు శశికళ, మరోవైపు షీలా బాలకృష్ణన్ పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు, నటుడు అజిత్ అన్నాడీఎంకే పార్టీ భవిష్యత్తు అని చెబుతున్నారు. ఇప్పటికే పార్టీలో ఉన్న వారు ఎవరికి వారు పట్టుకోసం ప్రయత్నిస్తుండటంతో.. పార్టీ ఒక్క తాటి పైన ఉండగలదా అనే చర్చ సాగుతోంది. పార్టీ అధికార ప్రతినిధిగా శశికళను ఎన్నుకోనున్నారనే ప్రచారం సాగుతోంది.
పార్టీ భవిష్యత్తుపై బెంగ!
ఈ నేపథ్యంలో ఆమె పార్టీని ఒక్కటిగా ఉంచగలరా అనే చర్చ సాగుతోంది. జయ మృతి అనంతరం గంటల్లోనే, అనూహ్య పరిణామాల మధ్య పన్నీరు సెల్వం సీఎం అయ్యారు. అయితే, ఇప్పుడు కార్యకర్తలకు, నాయకులకు పార్టీ భవిష్యత్తు పైన బెంగ పట్టుకుందని అంటున్నారు.
జయ ఆసుపత్రిలో ఉన్నప్పుడే..
జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పుడే.. పార్టీలో శశికళ చక్రం తిప్పారని అంటున్నారు. చాలామంది తమ ఫిర్యాదుల కోసం శశికళ వద్దకు వెళ్లారని చెబుతున్నారు. తద్వారా పార్టీ పైన పట్టుకోసం ఆమె మొదటి నుంచే పావులు కదుపుతోందని అంటున్నారు.
జయలలితను కలవనీయలేదు
జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పుడు నేతలు ఎవరు వచ్చినా శశికళ కలవనీయలేదని తెలుస్తోంది. తద్వారా పార్టీ పైన త పట్టు కోసం అప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించిందని అంటున్నారు.
తిరుగుబాటు..
జయ ఆసుపత్రిలో ఉన్నప్పుడే శశికళ పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేయడం చాలామంది నేతలకు రుచించలేదని, దీంతో పార్టీలో తీవ్ర అసంతృప్తి ఏర్పడిందని, అయితే తమ అధినేత్రి జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పుడు తిరుగుబాటు చేయడం సరికాదని భావించి మిన్నకుండిపోయారనే వాదనలు వినిపిస్తున్నాయి.
శశికళపై ఇంటెలిజెన్స్ కన్ను?
శశికళ, అన్నాడీఎంకే పైన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) కన్నువేసిందని తెలుస్తోంది. పార్టీలో జరుగుతున్న వ్యవహారాల పైన దృష్టి సారించినట్లుగా వార్తలు వస్తున్నాయి. రానున్న రెండు నెలలు అన్నాడీఎంకే పార్టీకి కీలకమైన సమయమని ఐబీ భావిస్తోందని తెలుస్తోంది.
అప్పుడు పార్టీ చీలవచ్చు
శశికళ వ్యవహార శైలిని కొందరు అసంతృప్త నేతలు, పార్టీ కార్యకర్తలు గమనిస్తున్నారు. శశికళ ముందుముందు తన కుటుంబ సభ్యులను కూడా పార్టీలోకి తీసుకు వచ్చి చక్రం తిప్పవచ్చునని భావిస్తున్నారు. పార్టీ పైన పట్టు కోసం ప్రయత్నిస్తున్న శశికళ.. తన కుటుంబ సభ్యులను తీసుకు వచ్చి మరింత పెత్తనం చెలాయించే సమయం వచ్చే పరిస్థితులు ఉంటే పార్టీ చీలికకు అవకాశముందని భావిస్తున్నారు.
శశికళకు పెద్ద సవాల్
పార్టీ పైన పట్టు కోసం ప్రయత్నిస్తున్న ఇతర నేతలతో పాటు మరికొందరు శశికళ పైన అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ చీలినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని ఒక్క తాటి పై నిలబడం శశికళకు పెద్ద సవాల్ అంటున్నారు. ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేవు. ఆమె పార్టీ పైన పూర్తి దృష్టి సారించనున్నారని అంటున్నారు.