శారదా చిట్ ఫండ్ స్కామ్లో సీబీఐ ముందుకు రాజీవ్ కుమార్
షిల్లాంగ్ : మమతా సర్కార్ కేంద్రం ప్రభుత్వం మధ్య యుద్ధం జరిగిన కొద్దిరోజులకే సీబీఐ రంగంలోకి దిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్కుమార్ను సీబీఐ విచారణ చేపట్టింది. శారదా చిట్ఫండ్ స్కామ్లో నాడు సిట్ అధికారిగా ఉన్న రాజీవ్ కుమార్ ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు యత్నించారన్న ఆరోపణలపై ఆయన్ను విచారణ చేస్తోంది సీబీఐ. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ కోల్కతాలో కాకుండా ప్రత్యామ్నాయ వేదికైన షిలాంగ్లో ఆయన్ను విచారణ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే గత ఆదివారం రాజీవ్ కుమార్ను విచారణ చేసేందుకు సీబీఐ అధికారులు ఆయన నివాసానికి వెళ్లగా పోలీసులు చుట్టుముట్టారు. దీంతో గందరగోళ వాతావరణం నెలకొంది. ఆ తర్వాత స్వయంగా ఆరాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వారిని అడ్డుకున్నారు. అదేసమయంలో కేంద్ర హెంశాఖ నుంచి ఫోన్లు రావడంతో సీబీఐ అధికారులను విడిచిపెట్టారు కోల్కతా పోలీసులు. ఇక కేంద్రం రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగుతోందని ఇందులో భాగంగానే సీబీఐని దుర్వినియోగం చేస్తోందంటే మమతా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర వైఖరిని నిరసిస్తూ ఆమె నిరసనకు కూడా దిగారు.
45 గంటల తర్వాత మమతా బెనర్జీ నిరసన కార్యక్రమాన్ని విరమించారు. అదే సమయంలో సుప్రీంకోర్టును సీబీఐ ఆశ్రయించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం రాజీవ్ కుమార్ విచారణ సంస్థకు సహకరించాలని ఆదేశించింది.