వాట్సప్లో సిబిఎస్ఈ అకౌంటెన్సీ ప్రశ్న పత్రం లీక్
న్యూఢిల్లీ: కేంద్ర మాధ్యమిక విద్యా కేంద్రం (సిబిఎస్ఈ) 12వ తరగతి అకౌంటెన్సీ పరీక్ష ప్రశ్న పత్రం లీకయింది. వాట్సప్లో దాన్ని లీక్ చేశారు. ఈ విషయాన్ని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా ధ్రువీకరించారు.
సోషల్ మీడియా గ్రూపుల్లో పంపిణీ అయిన ప్రశ్నలు సిబిఎస్ఈ ప్రశ్నలతో సరిపోలుతున్నాయని సిసోడియా అన్నారు. అయితే, పరీక్షను రద్దు చేస్తారా, లేదా అనే విషయంపై స్పష్టత లేదు.
ప్రశ్న పత్రం ఎలా లీకయిందనే విషయంపై చర్చించడానికి ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. పేపర్ను లీక్ చేయడంలో లోపలివాళ్ల పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రశ్న పత్రం లీకయిందనే ఫిర్యాదులు వచ్చాయని చెబుతూ తక్షణ చర్యలు తీసుకుంటామని సిసోడియా హామీ ఇచ్చారు. సిబిఎస్ఈకి ఫిర్యాదు చేసి విచారణ జరపాల్సిందిగా ఆయన ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ అధికారులను ఆదేశించారు.
వేగంగా చర్యలు తీసుకోవాలని, కష్టపడే విద్యార్థులు సిబిఎస్ఈ నిర్లక్ష్యం వల్ల నష్టపోకూడదని ఆయన ట్వీట్ చేశారు. ఈ నెల 5వ తేదీన సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. చివరి పరీక్ష ఏప్రిల్ 13వ తేదీన జరుగుతుంది.
పరీక్షలు ప్రారంభం కావడానికి ఒక రోజు ముందు మార్చి 4వ తేదీన్న బోర్డు అప్రమత్తత జారీ చేసింది. సిబిఎస్ఈ పరీక్షల కంట్రోలర్ కెకె చౌదరి జారీ చేశారు.