మళ్లీ సుప్రీంకోర్టు కొలీజియం వర్సెస్ మోడీ సర్కార్! ఇద్దరు జడ్జిల నియామకంలో కేంద్రం అభ్యంతరం!?
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జిల నియామకంపై సుప్రీంకోర్టు కొలీజియంతో కేంద్ర ప్రభుత్వానికి వివాదం కొనసాగుతూనే ఉంది. ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కెఎం జోసెఫ్ను సుప్రీంకోర్టు జడ్జిగా, పంజాబ్-హర్యానా హైకోర్టు జడ్జి సూర్యకాంత్ను హిమాచల్ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేయగా.. వీటిని మోడీ సర్కారు పక్కనబెట్టింది.
ఈ ఏడాది జనవరి 10న ఈ రెండు నియామకాలను కొలీజియం ప్రతిపాదించగా జడ్జిల నియామకంలో సీనియారిటీ సూత్రాన్ని పాటించలేదంటూ కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. కొలీజియంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్మిశ్రాతోపాటు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, మరో ఇద్దరు న్యాయమూర్తులు సభ్యులుగా ఉన్నారు.
1990వ దశకంలో సుప్రీంకోర్టు ఇచ్చిన రెండు తీర్పులకూ కొలీజియం సిఫారసులు విరుద్ధంగా ఉన్నాయని కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దేశంలోని 24 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సీనియారిటీ ప్రకారం జస్టిస్ జోసెఫ్ 12వ స్థానంలో, హైకోర్టు న్యాయమూర్తుల సీనియారిటీ ప్రకారం 45వ స్థానంలో ఉన్నందున సుప్రీంకోర్టు జడ్జిగా ఎలా సూచిస్తారని కొలీజియాన్ని కేంద్రం ప్రశ్నించింది.
అయితే, వారి ఎంపికకు సంబంధించి కొలీజియం పరిగణనలోకి తీసుకున్న ఇతర అంశాలు కూడా ఉన్నాయి. అంతేగాక జస్టిస్ కెఎం జోసెఫ్ పట్ల కేంద్రం అభ్యంతరానికి పరిశీలకులు వేరే కారణాన్ని ఉటంకిస్తున్నారు. 2016లో ఉత్తరాఖండ్లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించగా.. జస్టిస్ కెఎం జోసెఫ్ నేతృత్వంలోని ఆ రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వ చర్యను కొట్టివేసింది. అందుకే జస్టిస్ జోసెఫ్ పట్ల కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకత అని పరిశీలకులు పేర్కొంటున్నారు.