భారతీయ భాషల్లోనే స్టడీ మెటీరియల్: స్కూల్స్, విద్యా సంస్థలకు కేంద్రం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని స్కూల్స్, ఉన్నత విద్యా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాబోయే మూడేళ్లలో భారతీయ భాషల్లోని ప్రతి కోర్సుకు సంబంధించిన స్టడీ మెటీరియల్ ను విద్యార్థులకు డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంచాలని కేంద్రం ఆదేశించింది. విద్యార్థులకు మాతృ భాషలోనే చదువుకునే అవకాశం కల్పించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ ఈ మేరకు ఒక ప్రకటనలో పేర్కొంది.
యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్సీఈఆర్టీ, ఎన్ఐఓఎస్, ఇగ్నో వంటి రెగ్యూలరేటరీ సంస్థల ఆధీనంలోని అన్ని పాఠశాలలు, ఉన్న విద్యా సంస్థలు భారతీయ భాషల్లో స్టడీ మెటీరియల్స్ ను అందుబాటులో ఉంచాలని ఉత్తర్వులు కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. యూజీసీ, ఏఐసీటీఈతోపాటు పాఠశాల విద్యా విభాగం రాష్ట్రాల్లోని పాఠశాలలు, యూనివర్సిటీల్లో దీన్ని అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

జాతీయ విద్యా విధానం-2020 సిఫార్సుల ప్రకారం విద్యలో బహు భాషావాదాన్ని ప్రోత్సహించడం ద్వారా విద్యార్థులకు తమ మాతృ భాషల్లో చదువుకునే అవకాశం లభిస్తే.. మెరుగైన అభ్యసన ఫలితాలు సాధించవచ్చని పేర్కొంది. సొంత భాషలో అభ్యసించడం ద్వారా విద్యార్థికి భాషా అవరోధం లేకుండా వినూత్నంగా ఆలోచించే సహజ స్వభావం పెంపొందుతుందని వెల్లడించింది.
బహుభాషా సంపదను దేశ సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, విద్యాభివృద్ధికి సమర్థవంతంగా ఉపయోగించాల్సి ఉందని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. స్థానిక బాషల్లో మెటీరియల్ను సృష్టించడం ద్వారా బహుభాషా సంపదను పెంచవచ్చని.. దీంతో 2047 నాటికి మనదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు మార్గం సుగమమవుతుందని పేర్కొంది.












Click it and Unblock the Notifications