చెన్నై పేలుళ్లు: కాళ్లు కోల్పోయిన తెలుగు విద్యార్థి
ఒంగోలు: తమిళనాడు రాజధాని చెన్నై రైల్వే స్టేషన్లో గురువారం ఉదయం జరిగిన జంట బాంబు పేలుళ్లలో ప్రకాశం జిల్లా ఈపూరుపాలెంకు చెందిన ఆంజనేయులు అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. ఆంజనేయులు బెర్త్ కిందనే బాంబు పేలడంతో ఆయన రెండు కాళ్లు కోల్పోయారు.
ప్రస్తుతం ఆంజనేయులు చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆంజనేయులు రెండు కాళ్లకు ఫ్యాక్చర్ అయి ఉంటుందని, ఎక్స్రే రిపోర్టులు వచ్చిన తర్వాత అవసరమైతే సర్జరీ చేస్తామని వైద్యులు తెలిపారు. స్నేహితుడి ద్వారా సమాచారం తెలుసుకున్న ఆంజనేయులు తల్లిదండ్రులు వెంటనే చెన్నైకు బయలుదేరి వెళ్లారు.
చెన్నై ఎక్స్ప్రెస్ రైల్లో సంభవించిన జంట పేలుళ్లలో గుంటూరుకు చెందిన స్వాతి అనే టిసిఎస్ ఉద్యోగిని ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కొద్ది సేపట్లో ఇంటికి వస్తానని ఫోన్లో కుటుంబ సభ్యులకు చెప్పిన ఆమె కానరాని లోకాలకు వెళ్లిపోయారు.
చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న బెంగళూర్ - గౌహతి ఎక్స్ప్రెస్ రైల్లో గురువారం ఉదయం సంభవించిన జంట పేలుళ్లలో ఒకర మరణించగా, 14 మంది గాయపడిన విషయం కూడా తెలిసిందే. ఈ సంఘటనపై తమిళనాడు ప్రభుత్వం విచారణ ఆదేశించింది.