ముఖ్యంగా మగాళ్ల నుండే..: నటి, మాజీ ఎంపీ రమ్య
బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులో ఆరేళ్ల చిన్నారి పైన అత్యాచారం జరిగిన అంశంపై ప్రముఖ నటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు రమ్య అలియాస్ దివ్య స్పందన ట్విట్టర్లో స్పందించారు. పాఠశాలలు జవాబుదారీగా, బాధ్యతగా ఉండాలని ఆమె అన్నారు. పాఠశాల యాజమాన్యం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
పాఠశాలల్లో మరిన్ని భద్రతా సౌకర్యాలు ఉండాలని, ఇది చాలా ముఖ్యమైన విషయమన్నారు. పోస్కో (ప్రొటక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్స్) చట్టంలో సవరణలు చేయడంతో పాటు, సీసీ కెమెరాలు సాధ్యమైనన్ని ఎక్కువగా ఉండాలన్నారు. అన్నింటి కంటే ముఖ్యంగా మగవాడి నుండి మార్పు ప్రారంభం కావాల్సి ఉందని ఆమె మరో ట్వీట్లో అభిప్రాయపడ్డారు.
కాగా, బెంగళూరులో దారుణం సంఘటన ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆరేళ్ల పాప పైన ఓ ఉపాధ్యాయుడు అత్యాచారం జరిపినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి పోలీసులు ఆదివారం నాడు స్కేటింగ్ ఇన్స్ట్రక్టర్ను అరెస్టు చేశారు. కర్ణాటక రాజధాని బెంగుళూర్లో అత్యాచారం సంఘటనపై ప్రజల నుంచి ఆగ్రహం పెల్లుబుకిన నేపథ్యంలో ఈ అరెస్టు జరిగింది. ఆరేళ్ల బాలికపై పాఠశాల ఆవరణలో అత్యాచారం జరగడం తీవ్ర సంచలనం కలిగించింది.
కేసులో అనుమానంతో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత పాఠశాల స్కేటింగ్ ఇన్స్పెక్టర్ ముస్తాఫాను అరెస్టు చేసినట్లు బెంగళూర్ పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ చెప్పారు. 31 ఏళ్ల ముస్తఫా ఈ కేసులో ప్రధాన నిందితుడు. ముస్తఫాను అరెస్టు చేసిన విషయాన్ని ప్రకటిస్తూ మరిన్ని అరెస్టులు జరుగుతాయని ఎసిపి (క్రైమ్) ప్రణబ్ మొహంతి చెప్పారు.
ఈ దారుణమైన ఘటనలో ఇది మొదటి అరెస్టు. జులై 2వ తేదీన బాలికపై అత్యాచారం జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జులై 14వ తేదీన సంఘటన వెలుగు చూసింది. నిందితుడి నుంచి ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్టాప్లో అశ్లీల చిత్రాలు ఉన్నట్లు ఔరాద్కర్ చెప్పారు. ముస్తఫా బీహార్లోని దర్భంగాకు చెందినవాడు. గత 20 ఏళ్లుగా బెంగళూర్లో ఉంటున్నాడు.