లడఖ్ ప్రాంతంలోకి చైనా వాహనాలు: వెనక్కి పంపిన స్థానికులు, ఐటీబీపీ జవాన్లు
శ్రీనగర్: లడఖ్లోని లేహ్ జిల్లాలో చైనాకు చెందిన రెండు వాహనాలు కనిపించడం కలకలం సృష్టించింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వెలుగు చూసింది. అయితే, ఆ వీడియోపై చిత్రీకరించిన తేదీ లేకపోయినా కొద్ది రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుందని లడఖ్ అభివృద్ధి మండలి ప్రతినిధి ఇషే స్పాల్ జంగ్ మీడియాకు తెలిపారు.
స్థానిక సంచార జాతులవారు పశువులను మేపడానికి చాంగ్తాంగ్ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు చైనా బలగాలు అభ్యంతరాలు లేవనెత్తుతున్నాయని తెలిపారు. 5 నిమిషాల 26 సెకన్ల నిడివి ఉన్న వీడియో.. సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమైంది.

సివిల్ డ్రెస్లో ఉన్న చైనా సైనికులు వారి వాహనాలు మన భూభాగంలోకి వచ్చి స్థానికులతో వాగ్వాదానికి దిగారు. స్థానికులతోపాటు ఐటీబీపీ జవాన్లు తీవ్రంగా ప్రతిఘటించడంతో వారు వెనుదిరుగుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. అయితే, ఈ విషయంపై భారత సైన్యం ఎలాంటి ప్రకటన చేయలేదు.
Recommended Video
కాగా, ఈ ప్రాంతంలో ఎక్కువగా టిబెట్కు చెందిన శరణార్థులు నివసిస్తున్నారు. వాస్తవాధీన రేఖ వెంబడి బలగాలను ఉపసంహరించుకోవాలని ఓ వైపు చర్చలు జరుపుతూనే చైనా ఇలాంటి కుట్రలు చేయడం గమనార్హం. ఇప్పటికే పలుమార్లు ఇరు దేశాల సైనికాధికరులు బలగాల ఉపసంహరణపై చర్చలు జరిపిన విషయం తెలిసిందే. మరోసారి పూర్తిస్థాయిలో బలగాల ఉపసంహరణకు ఇరు దేశాలు అంగీకరించి, మరోమారు త్వరలో చర్చలు జరపనున్నాయి.












Click it and Unblock the Notifications