కామిడీ సోదాలు: ఈడీకి ఏమీ చిక్కలేదు, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, మర్యాదగా !
చెన్నై/న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికార పరిథిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ప్రశ్నించారు. ఆయన నివాసంపై శనివారం ఈడీ దాడులు చేసిన సందర్బంగా చిదంబరం మీడియాతో మాట్లాడారు. ఈడీ అధికారులు కామిడీ సోదాలు చేశారని చిదంబరం ఎద్దేవ చేశారు.
మర్యాదగా వ్యవహరించారు
ఈడీ అధికారులు మర్యాదగా వ్యవహరించారని, అయితే తన నివాసంలో సోదాలు జరపడం తనను బాధించిందని చిదంబరం విచారం వ్యక్తం చేశారు. తన కుమారుడు కార్తి చిదంబరం దాఖలు చేసిన కేసుల్లో సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులిచ్చిందని, ఈ కేసుల విచారణ ఈనెల 30వ తేదీ జరుగుందని చిదంబరం అన్నారు.
సుప్రీం కోర్టు
కుమారుడు కార్తి గురించి మాట్లాడిన చిదంబరం తన కుమారుడు ప్రధానంగా లేవనెత్తిన అంశాన్ని వివరించారు. షెడ్యూల్డు క్రైమ్కు సంబంధించి సీబీఐ కానీ ,ఇతర సంస్థలు కానీ తన కుమారుడు కార్తిపై ఎటువంటి ఎఫ్ఐఆర్నూ నమోదు చేయ్యలేదని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్ళామని చెప్పారు.
ప్రతిఫలం ఏది ?
ఈడీ అధికారులు ఆరోపిస్తున్న నేరానికి సంబంధించిన ప్రతిఫలం ఏదీ లేదని చిదంబరం అన్నారు. కాబట్టి తన కుమారుడు కార్తిపై విచారణ జరిపే అధికారం ఈడీకి లేదని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అభిప్రాయం వ్యక్తం చేశారు.
మా ఇంట్లో కార్తి !
ప్రస్తుతం తన ఇంట్లో సోదాలు చేయడాన్ని తాను ప్రశ్నించానని, అయితే ఈ ఇంట్లో కార్తి చిదంబరం ఉంటున్నట్లు భావించామని ఈడీ అధికారులు చెప్పారని చిదంబరం అన్నారు. బెడ్ రూం, వంట గది ప్రాంతాల్లో సోదాలు జరిపారని, వారికి ఏమీ చిక్కలేదని, ఈ విషయంపై తాను నిరసన వ్యక్తం చేశానని చిదంబరం అన్నారు.
ఎయిర్ సెల్, మ్యాక్సిస్
ఎయిర్సెల్, మ్యాక్సిస్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై శనివారం ఈడీ అధికారులు న్యూఢిల్లీ, చెన్నైలలో సోదాలు చేశారు. చిదంబరం తనయుడు కార్తి చిదంబరానికి చెందిన 6 చోట్ల, కార్తి అనుచరుల నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు చేసి ఒక్క సారి షాక్ ఇచ్చారు.
కామిడీ సోదాలు
ఈడీ అధికారులు శనివారం చేసిన సోదాలు కామిడీ సోదాలుగా ఉన్నాయని చిదంబరం ఎద్దేవచేశారు. ఎంత సోదాలు చేసినా ఈడీ అధికారులకు మాత్రం ఏమీ చిక్కలేదని, అసలు తప్పు జరిగి ఉంటే కాదా ఏమైనా ఆధారాలు చిక్కడానికి అని చిదంబరం అన్నారు.