మోడీపై కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు: వారణాసి నుంచి అజయ్
న్యూఢిల్లీ/బలరాంపూర్: భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ లోకసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారణాసి నుంచి కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపే అభ్యర్థిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. వారణాసి నుంచి మోడీని ఎదుర్కొనేందుకు స్థానిక ఎమ్మెల్యే అజయ్ రాయ్ను కాంగ్రెస్ పార్టీ బరిలో నిలిపింది. వారిణాసి నుంచి నరేంద్ర మోడీతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ కూడా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ వారణాసి లోకసభ స్థానానికి అజయ్ రాయ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సింగ్ సర్జేవాల మాట్లాడుతూ.. అజయ్ రాయ్ స్థానికుడని, ఇక్కడ అనేక ఎన్నికలను ఆయన విజయవంతంగా ఎదుర్కొన్నారని తెలిపారు.

క్షేత్రస్థాయిలో ఆయనకు ప్రజలతో సత్సంబంధాలున్నాయని ఇక్కడ ఆయనే సరైన అభ్యర్థిగా అధిష్టానం భావించిందని ఆయన చెప్పారు. కాగా, అజయ్ రాయ్ 2009 లోకసభ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి బిజెపి అభ్యర్థి మురళీ మనోహర్ జోషీ చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన అజయ్ రాయ్.. వారణాసిలోని పింద్రా అసెంబ్లీ ఎమ్మెల్యేగా గెలుపొందారు.
మోడీపై వ్యాఖ్యలు: కేంద్రమంత్రి బేణీప్రసాద్పై కేసు
బలరాంపూర్: బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని ‘బిగ్గెస్ట్ గుండా ఆఫ్ ఆరెస్సెస్'ని వ్యాఖ్యానించిన కేంద్రమంత్రి బేణీ ప్రసాద్ వర్మపై ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్లో కేసు నమోదైంది. బిజెపి అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్.. మోడీ సేవకుడని కూడా బేణీ ప్రసాద్ ఆరోపణలు చేశారు.
ఏప్రిల్ 1న బేణీ ప్రసాద్ వర్మ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఎన్నికల నియమావళిని అతిక్రమించారంటూ అధికారులు ఆయనపై మంగళవారం కేసు నమోదు చేశారు. ఈ ఎన్నికల సమయంలో వర్మపై ఇది రెండో కేసు కావడం గమనార్హం. మార్చి 31న పరిమితికి మించి వాహనాలు ఉపయోగించినందుకు ఆయనపై తొలి కేసు నమోదైంది.












Click it and Unblock the Notifications