సునంద మృతి: రిజైన్కు సిద్దపడ్డ థరూర్, అధిష్టానం నో
ఎన్సీపి, ఇతరుల డిమాండ్ నేపథ్యంలో శశి థరూర్ కూడా రాజీనామాకు సిద్ధపడ్డట్లుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెసు పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేయవద్దనే ఉద్దేశ్యంతో థరూర్ రాజీనామా చేసేందుకు సిద్ధమని అధిష్టానానికి చెప్పారట. అయితే, అధిష్టానం మాత్రం అవసరం లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది.
శశిథరూర్ రాజీనామా చేయాలన్నది త్రిపాఠీ వ్యక్తిగత అభిప్రాయమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సర్జేవాలా బుధవారం మీడియాతో అన్నారు. బాధ్యత కలిగిన హోదాలో ఉన్న శశి థరూర్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. సునంద మృతి విషయంలో శశి థరూర్పై ఇంతవరకూ ఎవరూ ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదని, రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు.
సునంద మరణంపై విచారణ ముగిసే వరకూ అధికార బాధ్యతలకు దూరంగా ఉండాలని థరూర్ భావించవచ్చని, అయితే ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించాలనడం సహేతుకం కాదన్నారు. థరూర్ రాజీనామా చేయాలని బిజెపి కేరళ విభాగం డిమాండ్ చేయడం వెనుక రాజకీయ కారణాలుండవచ్చన్నారు. సునంద మృతిపై వేగవంతంగా దర్యాప్తు చేసి వాస్తవాలను బహిర్గతం చేయాలని సాక్షాత్తూ శశి థరూర్ కేంద్ర హోం మంత్రికి లేఖ రాశారని చెప్పారు.