రెచ్చిపోయిన యోగి 'హిందూ' సంస్థ: ఇంట్లోకి చొరబడి యువతిపై దౌర్జన్యం..
మీరట్: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్థాపించిన హిందూ యువ వాహిణి సంస్థ కార్యకర్తలు మంగళవారం నాడు మీరట్ లో రెచ్చిపోయారు. మత మార్పిడులను ప్రోత్సాహిస్తున్నారని ఆరోపిస్తూ ఓ ఇంట్లోకి చొరబడ్డారు. ఆపై ఇంట్లో ఉన్న ఒక ముస్లిం వ్యక్తి, మరో యువతిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు.
మీరట్ లోని శాస్త్రినగర్ కాలనీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇంట్లోకి చొరబడ్డ హిందూ యువ వాహిని సంస్థ సభ్యులు అక్కడ అనుమానస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ముస్లిం యువకుడిని, అక్కడే ఉన్న మరో యువతిని నానా ప్రశ్నలతో ఇబ్బందిపెట్టారు.
నీ పేరేంటో చెప్పాలని, ఇక్కడెందుకున్నావ్, ఏం పని ఇక్కడ.. మీ పేర్లు ఎందుకు వేర్వేరుగా ఉన్నాయి. ఇద్దరూ మత మార్పిడికి పాల్పడుతున్నారా? అంటూ హిందూ యువ వాహిని సభ్యులు వారిద్దరిపై ప్రశ్నలు గుప్పించారు. అనంతరం ఇద్దరిని పోలీసులకు అప్పగించగా.. ఇద్దరూ ముస్లిం వర్గానికి చెందినవారేనని నిర్దారించిన పోలీసులు వారిని విడిచిపె్టారు. మీరట్ కమిషనర్ అలోక్ ప్రియదర్శిని ఈ విషయం వెల్లడించారు.
కాగా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 2002లో ఈ హిందూ యువ వాహిని సంస్థను స్థాపించారు. సీఎం స్థాపించిన సంస్థ ఇలాంటి దాడులకు పాల్పడటంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.