కరోనావైరస్: విజయవాడలో ఒకే ఇంట్లో నలుగురు ఎలా చనిపోయారు... కొత్త మ్యుటేషన్ కాటేస్తోందా?
''మామూలు జ్వరమే అనుకున్నాం. కానీ, మా ఇంట్లో నలుగురి ప్రాణాలు పోయాయి. కుటుంబం ఛిన్నాభిన్నం అయిపోయింది.'' కరోనా కారణంగా ఆప్తులను పోగొట్టుకున్న ఓ వ్యక్తి ఆవేదన.
కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ఈసారి కుటుంబంలో ఒక్కరికి కరోనా సోకినా అది వేగంగా మిగతా సభ్యులకు సోకడం చూస్తున్నాం.
గత ఏడాదికి భిన్నంగా ఒకే ఇంట్లో ఉంటున్న వారంతా మహమ్మారి బారిన పడుతున్న ఘటనలు ఇప్పుడు ఎక్కువగా నమోదవుతున్నాయి.
ఈ వారంలోనే విజయవాడలో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. సచివాలయంలో ఉద్యోగులైన భార్య, భర్తలిద్దరూ కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. పోరంకిలో మరో తల్లి, బిడ్డ మరణించారు.
ఇక వన్టౌన్ పరిధిలోని ఓ వ్యాపారి కుటుంబంలో ఏకంగా నలుగురు మరణించడం తీవ్ర విషాదం నింపింది.
ఇద్దరు అన్నదమ్ములు, వారిలో ఒకరి భార్య, కుమారుడు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన వారి కుటుంబంతో పాటుగా విజయవాడలోనే సంచలనంగా మారింది.
- ఆక్సిజన్ దొరికితేనే ఆయువు.. దిల్లీ ప్రజల నిస్సహాయ స్థితి
- కరోనా సెకండ్ వేవ్: ఆక్సిజన్ సరఫరాలో మోదీ ప్రభుత్వం ఎందుకు విఫలమవుతోంది
మొదట చిన్న జ్వరంలా వచ్చింది...
''మా బాబాయ్ దుర్గా ప్రసాద్ మెడికల్, ఫ్యాన్సీ షాపు నడుపుతుంటారు. మొదట మా పిన్ని పద్మావతికి ఈ నెల 8న జ్వరం వచ్చింది. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండడంతో జాగ్రత్తలు పడ్డాం. వెంటనే ఆస్పత్రికి తీసుకెళితే కోవిడ్ పరీక్ష చేయాలన్నారు. టెస్ట్ చేయిస్తే పాజిటివ్ వచ్చింది. ట్రీట్మెంట్ ఇప్పించాం.
ఆ తర్వాత వస్త్ర వ్యాపారం చేస్తున్న మరో బాబాయ్ కృష్ణకు కూడా సమస్య వచ్చింది. ఆయన్ని కూడా ఆస్పత్రిలో చేర్చాం. ఈలోగా దుర్గా ప్రసాద్ బాబాయికి కూడా సోకింది. నాలుగు రోజుల వ్యవధిలో ముగ్గురికి వైరస్ సోకింది. అందరికీ ఒకే ఆస్పత్రిలో వైద్యం అందించాం. కానీ, అందరూ మాకు దూరమయ్యారు'' అని విజయవాడకు చెందిన వెంకటేశ్ బీబీసీకి తెలిపారు. వెంకటేశ్ ఆ కుటుంబానికి సమీప బంధువు.
''ఈ నెల 17న పిన్ని చనిపోయారు. అదే రోజు బాబాయ్ కృష్ణ చనిపోయారు. ఆ విషాదంలో ఉండగానే దుర్గా ప్రసాద్ బాబాయ్ కొడుకు దినేశ్కు కూడా కరోనా సోకింది. దుర్గా ప్రసాద్ 19వ తేదీ చనిపోగా, ఆయన కుమారుడు దినేశ్ 20వ తేదీన చనిపోయారు. నాలుగు రోజుల వ్యవధిలో కుటుంబంలో నలుగురు చనిపోయారు'' అని వెంకటేశ్ వెల్లడించారు.
- లాక్ డౌన్ చరిత్ర ఏంటి... 400 ఏళ్ల కిందట రోమ్లో ఎందుకు విధించారు?
- గాంధీ హాస్పిటల్కు చేతులెత్తి దండం పెట్టిన ఓ మహిళ... ఆ వైరల్ ఫోటో వెనుక అసలు కథ
అంతిమ సంస్కారానికి కూడా భయమే..
వరుసగా మూడు రోజుల్లో ఒకే ఇంట్లో నలుగురు చనిపోవడంతో చివరకు దినేశ్ అంతిమ సంస్కారాలు చేయడం కూడా కష్టమైంది. ఎవరికి వారే భయంతో ఉండాల్సి వచ్చింది.
కృష్ణకు భార్య, ఒక కొడుకు ఉన్నారు. దినేశ్ కు ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబం ఛిన్నాభిన్నం కావడమే కాదు, మిగిలిన వాళ్లు తమ వారికి అంత్యక్రియలు కూడా జరపలేని పరిస్థితి ఏర్పడింది.
- భారత్ సాయం లేకుండా ప్రపంచ కోవిడ్ వ్యాక్సీన్ కల నెరవేరదు... ఎందుకంటే...
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
అందరూ జాగ్రత్తలు పాటించారు...కానీ...
''మా పిన్నికి పాజిటివ్ రాగానే మిగిలిన వాళ్లు జాగ్రత్త పడ్డారు. డాక్టర్ల సలహాలు, సూచనలు పాటిస్తూ మందులు, శానిటైజర్లు వాడుతూ జాగ్రత్తగానే ఉన్నా రక్షణ లేకుండా పోయింది.
నలుగురిని కోల్పోయిన విషాదాన్ని జీర్ణించుకోలేక పోతున్నాం. ఆస్పత్రి ఖర్చుల కోసం సుమారు రూ. 20లక్షలు ఖర్చు చేశారు. అయినా కాపాడుకోలేకపోయాం.'' అన్నారు వెంకటేశ్.
కుటుంబాలపై మ్యుటేషన్ దాడి
కుటుంబంలో ఒకరి నుంచి ఒకరికి వేగంగా కరోనా వ్యాపించడం ఈసారి స్పష్టంగా కనిపిస్తోందని వైద్యులు అంటున్నారు. కరోనా మ్యుటేషన్ జరగడంతో ఈ సమస్య పెరిగిందని ప్రభుత్వాసుపత్రి డాక్టర్ చంద్రశేఖర్ బీబీసీతో అన్నారు. గత ఏడాదికి భిన్నంగా ఈసారి ఉందన్నారు.
ఇంట్లో అందరూ జాగ్రత్తలు పాటించినప్పటికీ పిల్లలు స్కూళ్లకు వెళ్లిన సమయంలో వారి ద్వారా ఎక్కువగా వ్యాపించిందనే అనుమానాలున్నాయి.
ఇంట్లో యాంటీ బాడీస్ తక్కువగా ఉన్నవారు మొదట ప్రభావితులవుతున్నారు. వారి ద్వారా మిగిలిన వారికి ఈ సమస్య వస్తోంది.
గత ఏడాది ఒకరికి సమస్య వచ్చినా అదే ఇంట్లో ఐసోలేషన్లో ఉంటే మిగిలిన వారికి ఇబ్బంది ఉండేది కాదు. కానీ, ఈసారి అలా లేదు. ఆస్పత్రిలో చేరుతున్న కేసుల్లో కూడా దగ్గరి బంధువులు, సంబంధీకులు ఎక్కువగా ఉంటున్నారు.
ఈసారి కేసులు చెయిన్ లింకు స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి అందరూ జాగ్రత్తలు పాటించాల్సిందే అంటున్నారు వైద్య నిపుణులు.
ఇవి కూడా చదవండి:
- భారత్ సాయం లేకుండా ప్రపంచ కోవిడ్ వ్యాక్సీన్ కల నెరవేరదు... ఎందుకంటే...
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)