విజయ్ కు సీఎం కష్టమేనా ? గవర్నర్ నిర్ణయంపై తేల్చేసిన బీజేపీ..!
తమిళనాడు ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ (Vijay)పార్టీ టీవీకే (TVK)కు అధికార పీఠం అంత సులువుగా దక్కేలా కనిపించడం లేదు. ఇప్పటికే కాంగ్రెస్ తో కలిపి 112 ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ లోక్ భవన్ ను ఆశ్రయించిన విజయ్ కు రెండుసార్లు చుక్కెదురైంది. 118 సీట్లతో వస్తే రండి.. లేకపోతే ప్రభుత్వ ఏర్పాటు కష్టమేనంటూ గవర్నర్ తేల్చిచెప్పేశారు. ఈ నేపథ్యంలో తమిళనాడు గవర్నర్ వెనుక ఉండి ఈ నాటకాన్ని నడిపిస్తుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ (BJP) స్పందించింది.
తమిళనాడు గవర్నర్ ఇంకా టీవీకే పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానించనప్పటికీ, అంతా ప్రజాస్వామ్యబద్ధంగానే జరుగుతుందని బీజేపీ అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి పేర్కొన్నారు."రాజ్భవన్ లేదా గవర్నర్తో ఎలాంటి గందరగోళం ఉందని తాను అనుకోవడం లేదన్నారు. గవర్నర్ రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటారని తెలిపారు. ఆయన నియమ నిబంధనల ప్రకారమే వెళ్తారని తిరుపతి స్పష్టం చేశారు.

ప్రజలు తమ ఓట్లను వేసిన తీరు ఈ ఫలితాన్ని ప్రతిబింబిస్తోందని,తత్ఫలితంగా, ఏ ఒక్క పార్టీ కూడా సంపూర్ణ మెజారిటీ సాధించని విధంగా ఓటర్లు ఓటు వేశారని తిరుపతి తెలిపారు. మన రాజ్యాంగ చట్రం ప్రకారం, అత్యధిక సీట్లు, ప్రత్యేకంగా మొత్తం సీట్లలో సగానికి పైగా గెలుచుకుని, అవసరమైన మద్దతు పొందిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అర్హత పొందుతుందని, అయితే దురదృష్టవశాత్తు ఈ సందర్భంలో ఏ పార్టీ కూడా మెజారిటీ సాధించలేదని నారాయణన్ తిరుపతి తెలిపారు. తద్వారా మెజార్టీ లేని విజయ్ కు గవర్నర్ అవకాశం ఇవ్వబోరని తేల్చిచెప్పేసినట్లయింది.













Click it and Unblock the Notifications