మహిళా ఉద్యోగులకు విజయ్ బంపర్ ఆఫర్..! ఇక ఏడాది సెలవులు..!
తమిళనాడులో విజయ్ సర్కార్ (Tamil Nadu government) మహిళా ఉద్యోగులకు ఇవాళ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు (women employees) మూడో బిడ్డ పుడితే ఇచ్చే సెలవును 365 రోజులకు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. అంటే 365 రోజుల పాటు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు (Maternity Leave) మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇప్పటివరకు మొదటి ఇద్దరు పిల్లలకు మాత్రమే ఈ ఏడాది కాలం సెలవుల సౌకర్యం అందుబాటులో ఉండగా, తాజాగా ఈ నిబంధనను మూడో బిడ్డకు కూడా వర్తింపజేస్తూ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం తమిళనాడులో అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం, ఇద్దరు కంటే తక్కువ మంది సంతానం ఉన్న మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ఒక సంవత్సరం పాటు ప్రసవ సెలవులు లభిస్తున్నాయి. ఒకవేళ ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది జీవించి ఉన్న పిల్లలు ఉంటే, మూడో బిడ్డకు కేవలం 12 వారాలు (84 రోజులు) మాత్రమే ప్రసవ సెలవు పొందేందుకు వీలుంది. అయితే సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గతంలో చేసిన సవరణల ప్రకారం ఈ పరిమితి కొనసాగుతోంది. ఇప్పుడు విజయ్ సర్కార్ తాజా నిర్ణయంతో మూడో బిడ్డకు కూడా పూర్తి వేతనంతో కూడిన 365 రోజుల సెలవులు లభించనున్నాయి.

తమిళనాడు అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా మంత్రి శరత్కుమార్ ఈ కీలక మార్పును అధికారికంగా ప్రకటించారు. తమ ప్రభుత్వం సామాజిక సంక్షేమానికి, మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మహిళా ఉద్యోగుల ఆరోగ్యం, వారి పిల్లల సంరక్షణను దృష్టిలో ఉంచుకుని మూడో బిడ్డకు కూడా ఈ ప్రసవ సెలవుల కాలాన్ని 12 వారాల నుంచి ఏకంగా 365 రోజులకు పెంచుతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. తమిళనాడులో మహిళా ప్రభుత్వ ఉద్యోగుల ప్రసూతి సెలవుల పరిమితి గత కొన్నేళ్లుగా క్రమంగా పెరుగుతూ వస్తోంది. తొలుత కేవలం 90 రోజులుగా ఉన్న ఈ సెలవులను 2011 లో 6 నెలలకు పొడిగించారు. ఆ తర్వాత 2016 లో దీనిని 9 నెలలకు పెంచారు. జూలై 2021లో దీన్ని ఏడాదికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు అదే ఏడాది కాల పరిమితిని మూడో బిడ్డకు కూడా వర్తింపచేసారు.














Click it and Unblock the Notifications