రోజూ తెల్లవారు జామున 4 గంటలకే ఠంచనుగా సీఎం విజయ్ నుంచి ఫోన్ వస్తుంది: 20 గంటలు
తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన విజయ్.. విజయవంతంగా 100 రోజుల పాలనను పూర్తి చేసుకున్నారు. సినీ గ్లామర్తో రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. తొలి ఎన్నికల్లోనే గెలుపును కైవసం చేసుకున్నారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. ముఖ్యమంత్రిగా ఈ బాధ్యతలను ఎలా నిర్వహిస్తున్నారనే దానిపై ప్రజల్లోనూ, రాజకీయ విశ్లేషకుల్లోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది.
ఈ నేపథ్యంలో ఆయన పరిపాలనా శైలి, పనితీరుపై మంత్రి ఆధవ్ అర్జున పలు కీలక విషయాలను వెల్లడించారు. అసెంబ్లీలో పబ్లిక్ వర్క్స్ బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మాట్లాడారు. విజయ్ పనితీరు, క్రమశిక్షణ తమను ఆశ్చర్యపరుస్తోందని కొనియాడారు. సాధారణంగా నటుల నుంచి రాజకీయ నాయకులుగా మారినవారు నెమ్మదిగా పరిపాలనను అలవాటు చేసుకుంటారని, విజయ్ మాత్రం దీనికి భిన్నమని చెప్పారు. బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు నుంచే పూర్తి స్థాయి పాలకుడిగా మారిపోయారని అన్నారు.

విజయ్ ప్రస్తుతం రోజుకు సుమారు 18 నుంచి 20 గంటల పాటు అవిశ్రాంతిగా పని చేస్తోన్నారని, ప్రజా సేవలో తీరిక లేకుండా గడుపుతున్నారని ఆధవ్ అర్జున వెల్లడించారు. విజయ్ దినచర్య ప్రతిరోజూ తెల్లవారుజామున 4 గంటలకే ప్రారంభమవుతుందని చెప్పారు. ఆ సమయంలోనే వివిధ శాఖల మంత్రులకు స్వయంగా ఫోన్లు చేస్తూ, ఆయా విభాగాల్లో జరుగుతున్న అభివృద్ధి పథకాల పురోగతిని, తాజా పరిస్థితులను క్షుణ్ణంగా అడిగి తెలుసుకుంటున్నారని తెలిపారు.
ఎన్నికల్లో ప్రజలు తమకు అందించిన భారీ విజయం.. తమలో తిరుగులేని నమ్మకాన్ని నింపిందే తప్ప, ఎలాంటి అహంకారానికి తావు ఇవ్వలేదని ఆధవ్ అర్జున స్పష్టం చేశారు. అధికారం లభించిందనే బాధ్యతతో విశ్రాంతి తీసుకోకుండా, ప్రతి క్షణం ప్రజల సమస్యల పరిష్కారం కోసం సీఎం విజయ్ తపన పడుతున్నారని, వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న దీర్ఘకాలిక సవాళ్లను గుర్తించి వాటిని పరిష్కరించడమే లక్ష్యంగా సాగుతున్నారని వివరించారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సచివాలయంలో విజయ్ ఓ రాజకీయ సన్యాసి తరహాలో కనిపిస్తున్నారని ఆధవ్ అర్జున వ్యాఖ్యానించారు. విజయకేతనం ఎగురవేసిన ఆనందంలో మునిగిపోకుండా.. తరువాత ఏం చేయాలి, ప్రజల సమస్యలకు ఎలా పరిష్కారం చూపాలి.. అనే ఆలోచనలతోనే ఆయన నిరంతరం గడుపుతున్నారని చెప్పారు. ప్రభుత్వంలో అవినీతిని పూర్తిగా నిర్మూలించడమే తమ నాయకుడి ప్రధాన అజెండా అని పేర్కొన్నారు.
మొదటి వంద రోజుల పాలనలో ఆర్థిక పరమైన లీకేజీలను అరికట్టి, ప్రభుత్వ ఖజానాకు గండి పడకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు ఆధవ్ చెప్పారు. పాలనలో సంపూర్ణ పారదర్శకతను సాధించేందుకు విజయ్ నిరంతరం నిఘా పెట్టారని, దశాబ్దాల కాలంగా వ్యవస్థలో పాతుకుపోయిన కింది స్థాయి అవినీతిని తుడిచిపెట్టడం కొంత సమయంతో కూడుకున్న పనే అయినప్పటికీ, ఖచ్చితంగా దానిని అరికడతామనే నమ్మకాన్ని ఆయన వ్యక్తపరిచారు.
వ్యవస్థలో మార్పు అనేది ఎప్పుడైనా పైస్థాయి నుంచే ప్రారంభం కావాలని విశ్వసించే ముఖ్యమంత్రి విజయ్, తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారని అర్జున గుర్తుచేశారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా పారదర్శకంగా పనిచేయాలని, ఎక్కడా అవినీతి అక్రమాలకు తావు ఉండకూడదని అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారని పేర్కొన్నారు.














Click it and Unblock the Notifications