శశికళ అరెస్టుకు కౌంట్ డౌన్ మొదలైంది.. స్వయంగా లొంగిపోతారని ప్రకటన!?
అక్రమాస్తుల కేసులో శశికళను దోషిగా తేల్చడంతో శశికళ అరెస్టుకు కౌంట్ డౌన్ మొదలైందనే చెప్పుకోవాలి.
చెన్నై: సినిమాలను, సీరియళ్లను మించిన నాటకీయతతో రోజురోజుకు పెరుగుతూ వచ్చిన హైడ్రామాకు సుప్రీం తన తీర్పుతో తెరదించింది. అక్రమాస్తుల కేసులో శశికళను దోషిగా తేల్చడంతో ఆమె తర్వాతి నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
గోల్డెన్ బే రిసార్టు బయట ప్రస్తుతం శశికళ లొంగుబాటు కోసం పోలీసులు కాచుకు కూర్చున్నారు. దీంతో శశికళ అరెస్టుకు కౌంట్ డౌన్ మొదలైందనే చెప్పుకోవాలి. వాస్తవానికి శశికళ లొంగిపోయేందుకు సుప్రీం నాలుగువారాల గడువు ఇచ్చినా.. ఆమె ఎక్కువ రోజుల బయట ఉంటే రాజకీయ అనిశ్చితి కొనసాగే కారణమున్నందునా.. ఆమెను వీలైనంత త్వరగా జైలుకు తరలించాలని పోలీసులు భావిస్తున్నారు.
కాగా, సుప్రీం తీర్పు అనంతరం అన్నాడీఎంకె నేతలు శశికళ లొంగుబాటుపై స్పందించారు. పోలీసులంతా రిసార్టును చుట్టుముట్టిన నేపథ్యంలో.. శశికళ స్వయంగా లొంగిపోతారని అన్నాడీఎంకె నేతలు స్పష్టం చేశారు. పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేసిన తర్వాత ఆమె పోలీసులకు లొంగిపోతారని వారు చెబుతున్నారు.
ఇదే క్రమంలో పోలీసులు సైతం ఆమెను లొంగిపోయిన వెంటనే అరెస్టు చేసేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. సుప్రీం నుంచి తీర్పు వెలువడటమే ఆలస్యం 35 వాహనాల్లో ఎస్పీ, డీఎస్పీ స్థాయి పోలీసు అధికారులు, గోల్డెన్ బే రిసార్టును చుట్టుముట్టారు.
రిసార్టు చుట్టు పక్కల ప్రాంతాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. అలాగే రిసార్టు బయటి గేటు తాళాలను బద్దలు కొట్టి మరీ పోలీసులు లోనికి వెళ్లినట్టుగా తెలుస్తోంది.అయితే శశికళ లొంగిపోయేందుకు కొంత గడువు ఇవ్వాలని భావిస్తున్నందునా..పోలీసులు వేచిచూసే అవకాశముంది.
నిర్మానుష్యంగా పోయెస్ గార్డెన్:
కాగా, ఈ ఉదయం శశికళ మద్దతుదారులతో సందడిగా దర్శనమిచ్చిన పోయెస్ గార్డెన్ సుప్రీం తీర్పుతో ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారిపోయింది. ఇప్పటిదాకా శశికళకు మద్దతు తెలుపుతూ వచ్చినవారంతా ఇప్పుడు సందిగ్ధంలో పడిపోయారు. పన్నీర్ వైపు వెళ్లాలా? లేక వేచిచూడాలా? అన్న ఆలోచనలో వారున్నారు.