రాత్రి పూట సైకిల్ బ్యాచ్.. ఇళ్ల ముందు కరెన్సీ నోట్లు.. అంతుచిక్కని ఘటన..
తమిళనాడులోని చెన్నైలో ఉన్న పురసైవాక్కం, వెస్ట్ మాంబళం, మాధవరం తదితర ప్రాంతాల్లో వింత ఘటన చోటు చేసుకుంది. రాత్రిపూట కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడి కాలనీల్లోని ఇళ్ల ముందు కరెన్సీ నోట్లు వెదజల్లి పారిపోయారు. కరెన్సీ నోట్లు ఇలా పారేశారంటే దాని వెనకాల ఇంకేదో కుట్ర ఉందని కాలనీ వాసులు అనుమానిస్తున్నారు. బహుశా.. కరోనా వైరస్ను కరెన్సీ నోట్ల ద్వారా వ్యాప్తి చేసే కుట్రకు పాల్పడుతున్నారా అని అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారం స్థానికులకు అంతుచిక్కట్లేదు.
రాత్రిపూట సైకిల్ బ్యాచ్..
ఈ నెల 2వ తేదీ రాత్రి మాధవరం పాలకొట్టం సమీపంలోని కేకే తాళై మాణిక్యం వీధిలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సైకిళ్లపై సంచరించారు. అదే సమయంలో సైకిళ్లపై ఉన్న మూటల్లో నుంచి రూ.20,రూ.50, రూ.100 కరెన్సీ నోట్లను కాలనీలోని ఇళ్ల ముందు వెదజల్లారు. కొంతమంది స్థానికులు మాటు వేసి వీరిని పట్టుకుందామని ప్రయత్నించినప్పటికీ.. వారి చేతికి చిక్కలేదు. అయితే ఇలా ఇళ్ల ముందు కరెన్సీ నోట్లు ఎందుకు చల్లుతున్నారన్నది వారికి అంతుపట్టడం లేదు.
సోషల్ మీడియాలో హల్చల్..
ఓ స్థానిక మహిళ ఆ కరెన్సీ నోట్లను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది. వాటిని ఎవరూ తాకవద్దని.. కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని పేర్కొంది. ఉద్దేశపూర్వకంగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కరోనాను వ్యాప్తి చెందించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. నిందితులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరింది. ఆ నోటా.. ఈ నోటా.. మొత్తానికి ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి వెళ్లింది.
Recommended Video
కేసు నమోదు చేసిన పోలీసులు
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. స్థానిక కాలనీల్లోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని ఇంతవరకూ శాస్త్రీయంగా నిర్దారణ కాలేదని.. కాబట్టి ప్రజలెవరూ భయాందోళనకు గురికావద్దని చెప్పారు. ఇళ్లల్లో దొంగతనాలకు డబ్బులను ఎరగా వేసి ఉంటారా అని అనుమానిస్తున్నారు. నిందితులను త్వరలో పట్టుకుని అసలు నిజాలు తేలుస్తామని చెప్పారు.