పొలిటికల్ ఎంట్రీపై సమీప భవిష్యత్తులో నిర్ణయం: జయ మేనకోడలు
తన పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి సమీప భవిష్యత్తులో స్పష్టమైన నిర్ణయం తీసుకుంటానని తాజా ప్రకటన ద్వారా దీపజయకుమార్ స్పష్టం చేశారు.
చెన్నై: తమిళ దివంగత సీఎం జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఏ క్షణాన ఏ కీలక మలుపు చోటు చేసుకుంటుందోనన్న ఆసక్తితో జనం అక్కడి రాజకీయాలను గమనిస్తున్నారు.
ఇకపోతే అన్నాడీఎంకె పార్టీకి సంబంధించి శశికళకు పగ్గాలు అప్పగించడానికి ఇప్పటికే సర్వం సిద్దమైపోయింది. మరోవైపు శశికళ వ్యతిరేకులకు మాత్రం ఇది ఏమాత్రం మింగుడుపడటం లేదు. ఇలాంటి తరుణంలో జయలలిత మేనకోడలు దీపజయకుమార్ గురువారం నాడు ఓ కీలక ప్రకటన చేశారు.

ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో శూన్య స్థితి నెలకొందని, తన రాజకీయ ప్రవేశానికి సంబంధించి త్వరలోనే ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. అత్త మరణంతో ప్రస్తుతం తాను సంతాప భావనలోనే ఉన్నానని, తనకు మరికొంత సమయమివ్వాలని ఆమె తన మద్దతుదారులను కోరారు.
విపత్కర పరిస్థితుల్లో నిజమైన అన్నాడీఎంకె కార్యకర్తలు శాంతియుతంగా ఉంటారని అన్నారు. తనకు అండగా నిలబడిన మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు. వారి మద్దతును ఎన్నటికీ మరిచిపోలేనని తెలియజేశారు. జయలలిత ఆశీస్సులతోనే తాను ముందుకు సాగుతానని, అత్త చూపించిన మార్గంలోనే అన్నాడీఎంకెను, తమిళనాడును సరైన దారిలో నడిపించే దిశగా ప్రయత్నం చేస్తానని అన్నారు.
తన పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి సమీప భవిష్యత్తులో స్పష్టమైన నిర్ణయం తీసుకుంటానని తాజా ప్రకటన ద్వారా దీపజయకుమార్ స్పష్టం చేశారు. కాగా, దీపజయకుమార్ రాజకీయాల్లోకి రావాలని ఆమె పేరిట పలు చోట్ల బ్యానర్లు, కటౌట్ల ద్వారా మద్దతుదారులు తమ అభిమానాన్ని చాటుకుంటున్న సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications