ఎగ్జిట్ పోల్స్: జమ్మూ కాశ్మీర్లో హంగ్, జార్ఖండ్లో కమలం
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ హంగ్ అసెంబ్లీని అంచనా వేస్తుండగా, జార్ఖండ్లో మాత్రం కమలానిది పైచేయి అవుతుందని అంచనా వేస్తున్నాయి. జార్ఖండ్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధికారంలోకి రాబోతున్నట్టు అంచనా వేస్తున్నారు. జార్ఖండ్లో మొత్తం 81 సీట్లు ఉన్నాయి. జార్ఖండ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు మంగళవారంనాడు వెలువడనున్నాయి.
ఇటీవల ఐదు దశలలో జరిగిన జార్ఖండ్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి 41 నుంచి 49 సీట్లు రావచ్చునని ఇండియా టుడే-సిసిరో సర్వేలో వెల్లడైంది. శిబు సోరెన్కు చెందిన జెఎంఎం పార్టీకి 15 నుంచి 19 సీట్లు, కాంగ్రెస్కు 7 నుంచి 11 సీట్లు రావచ్చునని ఈ సర్వే అంచనా వేసింది. ఇకపోతే ఇతరులకు 8-12 సీట్లు రావచ్చునని ఈ సర్వేలో వెల్లడైంది.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధి అనారోగ్యం కారణంవల్ల జార్ఖండ్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో అసలు పాల్గొనలేదు. కాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం బిజెపి విజయంకోసం జార్ఖండ్లో విస్త్రతంగా పర్యటించారు. సర్వే ఫలితాలు స్పష్టంగా ఉండడంతో ఢిల్లీ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఇప్పటికే పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఎబిపి న్యూస్ - నీల్సన్ సర్వే ప్రకారం బిజెపికి జార్ఖండ్లో 52 సీట్లు వస్తాయి.
జమ్మూ కాశ్మీర్లో పిడిపికి పూర్తి మెజారిటీ రాదని సి సర్వే తెలియజేస్తోంది. అయితే, అతి పెద్ద పార్టీగా మాత్రం అవతరిస్తుందని అంచనా వేసింది. జమ్మూ కాశ్మీర్లో 87 సీట్లు ఉండగా పిడిపికి 32 నుంచి 38 సీట్లు రావచ్చునని అంచనా వేసింది. బిజెపి రెండో స్థానంలో నిలుస్తుందని చెబుతున్నారు.
సివోటర్ ఎగ్జిట్ పోల్ ప్రకారం - జమ్మూ కాశ్మీర్లో పిడిపికి 32 నుంచి 38 సీట్లు, బిజెపికి 27 నుంచి 33 సీట్లు, నేషనల్ కాన్ఫరెన్స్కు 8 నుంచి 14 సీట్లు, కాంగ్రెసుకు 4 నుంచి 10 సీట్లు వస్తాయి.
రెండు రాష్ట్రాల్లోనూ ఐదు దశల్లో పోలింగ్ జరిగింది. మొదటి దశ నవంబర్ 25 తేదీన జరిగింది. జమ్మూ కాశ్మీర్లో మొదటిదశలో రికార్డు స్థాయిలో 70 శాతం పోలింగ్ జరిగింది.