వాళ్లకే: గీతాకొడా, ఎవరు అడగలేదు.. ఓడుతానని తెలుసు!: ఒమర్
న్యూఢిల్లీ: జార్ఖండ్ రాష్ట్ర అభివృద్ధికి ఎవరు కృషి చేస్తారో వారికి తాము మద్దతు ఇస్తామని జైభారత్ సమంతక్ పార్టీ నేత గీతా కొడా మంగళవారం చెప్పారు. ఆమె ఈ పార్టీ తరఫున జగన్నాథపుర్ నుండి విజయం సాధించారు. ఆమె భర్త, మాజీ ముఖ్యమంత్రి మధుకొడా మజ్గావ్ నుండి ఓటమి చెందారు.
మమ్మల్ని ఎవరు అడగలేదు: ఒమర్
ఆరేళ్ల పాటు నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు తాము సిద్ధమని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి, నేషనల్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత ఒమర్ అబ్దుల్లా చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం తమను ఎవరు సంప్రదించలేదని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు కోసం తాము ఎవరినీ అడగమన్నారు.
బీజేపీ ఆశించిన ఫలితాలు సాధించిందన్నారు. ఎన్నికల్లో తమకు అనుకున్నంత నష్టం ఏమీ జరగలేదని అభిప్రాయపడ్డారు. తద్వారా ఆయన పార్టీ ఫలితాల పైన సంతృప్తి వ్యక్తం చేసినట్లుగా కనిపిస్తోంది. అన్ని పార్టీలు కూడా తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకే చూశాయన్నారు.
ఎవరికీ కూడా మెజార్టీ రాలేదన్నారు. సోనావర్ నుండి తాను గెలుపొందడం కష్టమని తనకు తెలుసునని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వారి ప్రయోజనాల కోసం ఎప్పుడు పొత్తులను మార్చుకుంటుందని విమర్సించారు. రాజ్యసభ బెర్త్ కోసం ఆజాద్ ఏమైనా చేస్తారన్నారు.
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో అధికార పార్టీ అయిన నేషనల్ కాంగ్రెస్ పార్టీ చతికిల పడ్డ విషయం తెలిసిందే. ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని ఈ పార్టీ 15 స్థానాలు గెలుచుకుంది. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) 28 స్థానాలతో మొదటి స్థానంలో, 25 స్థానాలతో భారతీయ జనతా పార్టీ ద్వితీయ స్థానంలో ఉంది.
పీడీపీతో సిద్ధం: ఆజాద్
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు పీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు తాము సిద్ధమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ చెప్పారు. తాము గతంలో పీడీపీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీలతో పొత్తు పెట్టుకున్నామని, ఈసారి కూడా సిద్ధమన్నారు. భారతీయ జనతా పార్టీతో మాత్రం ఎలాంటి పొత్తు పెట్టుకోబోమన్నారు.
గతంలో పీడీపీ - కాంగ్రెస్ పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. పీడీపీ, కాంగ్రెస్ పార్టీలు దశలవారీగా ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వహించాయి. మొదట పీడీపీ నుండి ముఫ్తీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి గులాం నబీ ఆజాద్ ముఖ్యమంత్రిగా అయ్యారు.