కొడుకు వేధింపులు: మర్మాంగాన్ని కోసుకున్న తండ్రి
బెంగళూరు: మద్యానికి బానిసైన తన కుమారుడి ప్రవర్తన భరించలేక ఓ తండ్రి తన ప్రాణాలను తీసుకున్నాడు. ఈ హృదయవిదారక ఘటన కర్ణాటకలోని తమకూరు జిల్లా కొరటిగెరె తాలూకా జట్టి అగ్రహార గ్రామంలో చోటు చేసుకుంది. శనివారం జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జట్టి అగ్రహార గ్రామానికి చెందిన సంజీవరాయప్ప(69) భార్య కొన్ని సంవత్సరాల క్రితం మృతి చెందింది. కాగా, తన నివాసంలోనే కుమారుడు నాగరాజుతో కలిసి ఉంటున్నాడు సంజీవరాయప్ప. అయితే, మద్యానికి బానిసైన నాగరాజు తరచూ కుటుంబసభ్యులను వేధింపులకు గురిచేసేవాడు.
దీంతో అతని కుమారుడు, భార్య కూలీ పనుల కోసం బెంగళూరు వెళ్లిపోయారు. వృద్ధాప్యం కారణంగా మంచానికే పరిమితమైన సంజీవరాయప్ప.. కుమారుడి వేధింపులు భరించలేకపోయాడు. తరచూ మద్యం తాగి వచ్చి రాయప్పను దుర్భాషలాడటంతపాటు అందిన వస్తువుతో కొట్టేవాడు నాగరాజు.
శుక్రవారం రాత్రి కూడా నాగరాజు తన తండ్రి రాయప్పను తీవ్రంగా కొట్టాడు. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన సంజీవరాయప్ప.. శనివారం ఉదయం కుమారుడు బయటికి వెళ్లగానే కత్తితో మర్మాంగాన్ని కోసుకున్నాడు. బాధ భరించలేక కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు ఆస్పత్రిలో చేర్పించారు.
కొరటిగెర ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు రాయప్ప. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.