మోడీ లాగే: యూపీ బిజెపి అధ్యక్షుడిగా ఎదిగిన కేశవ్
లక్నో: ప్రధాని నరేంద్ర మోడీ లాగే భారతీయ జనతా పార్టీలో ఎదుగుతున్నాడు మరో నాయకుడు. అతనికి మోడీకి చాలా పోలికలు ఉండటం విశేషం. ఆయనే ఉత్తరప్రదేశ్ నూతన బిజెపి అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య. అయితే, ఆయనీ స్థానానికి రావడం అంత సులభంగా ఏమీ జరగలేదు.
ఇంకా చెప్పాలంటే, అట్టడుగు స్థాయి నుంచి పైకి వచ్చిన వ్యక్తి కేశవ్ ప్రసాద్. ప్రధాని నరేంద్ర మోడీతో పోల్చి చూస్తే, కేశవ్ ఎన్నో దగ్గరి పోలికలను కలిగివుంటాడు. వాటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన వాటిల్లో ఒకటి.. కేశవ్ ప్రసాద్ కూడా టీ అమ్ముకునే స్థాయి నుంచి ఎదిగాడు.
ప్రధాని మోడీ లాగే.. విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా కేశవ్ పనిచేశారు. అంతేగాక, యువకుడిగా ఉన్న సమయంలో ఆయన దినపత్రికలను కూడా విక్రయించేవారట. ఇక ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మరో సంవత్సరంలో ఉన్న సమయంలో.. బిజెపి కేశవ్ ప్రసాద్ మౌర్యాను పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేసింది.
ఓబీసీకి చెందిన కుశ్వాహ వర్గానికి చెందిన కేశవ్ ఎంపిక బీజేపీ అధిష్ఠానం వ్యూహాత్మక నిర్ణయిమేనని రాజకీయ పండితులు భావిస్తున్నారు. యూపీలో కుశ్వాహ వర్గం ప్రజలు 8 శాతం ఉండటం, ఒకప్పుడు మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రాతినిధ్యం వహించిన ఫుల్పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున తొలిసారిగా విజయం సాధించడం ఆయన్ను ఈ పదవికి దగ్గర చేశాయి.
ఇక హిందుత్వ అంశాన్ని కూడా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక అస్త్రంగా చేసుకోవాలనుకుంటున్న బీజేపీ.. అందుకు కేశవ్ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే, తాము అభివృద్ధే ప్రధానాంశంగా ఎన్నికలకు వెళతామని కేశవ్ పేర్కొంటున్నారు. కాగా, గత శుక్రవారం నాడు ఐదు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులను బీజేపీ మార్చిన సంగతి తెలిసిందే.