హైస్పీడ్ రైల్వే సిస్టమ్: బుల్లెట్ రైలు, జపానే ఎందుకు?
న్యూఢిల్లీ: భారత్లో జపాన్ నిర్మించనున్న హై స్పీడ్ రైల్వే సిస్టమ్స్తో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరితంగా బలపడనున్నాయి. జపాన్ ప్రధాని షింజో అబే తన మూడు రోజుల భారత్ పర్యనటలో రక్షణ, అణు ఇంధనం లాంటి కీలకమైన రంగాల్లో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి.
ఈ ఒప్పందాల్లో దాదాపు రూ.98 వేల కోట్ల రూపాయల వ్యయంతో ముంబై, అహ్మదాబాద్ నగరాల మధ్య మొట్టమొదటిసారిగా బుల్లెట్ రైలు నెట్వర్క్ నిర్మాణానికి సంబంధించిన ఒప్పందం భారతీయ రైల్వే రంగంలో ఓ సరికొత్త శకానికి నాంది పలికింది.
బుల్లెట్ రైలు ఒప్పందం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రధాని మోడీ బుల్లెట్ రైలు గురించి ప్రస్తావిస్తూ ''వేగం, విశ్వసనీయత, భద్రతకు పేరుగాంచిన షింకన్సేన్ ద్వారా ముంబై- అహ్మదాబాద్ సెక్టార్లో అత్యంత వేగవంతమైన రైలును ప్రవేశపెట్టడానికి తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైంది'' అని పేర్కొన్నారు.
బుల్లెట్ రైలు వ్యయం 98 వేల కోట్ల రూపాయలని అంచనా:
ముంబై-అహ్మదాబాద్ మధ్య నిర్మించతలపెట్టిన ఈ బుల్లెట్ ట్రైన్ నిర్మాణ వ్యయం 98 వేల కోట్ల రూపాయలని కేంద్రం అంచనా వేసింది. అంతేకాదు ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం 50 ఏళ్ల పరిమిత కాలానికి గాను 0.1 శాతం వడ్డీకే 12 మిలియన్ డాలర్ల ప్యాకేజీని భారత్కు ఇచ్చేందుకు జపాన్ ప్రభుత్వం ముందుకొచ్చింది.
ఈ బుల్లెట్ రైలు ముంబై నుంచి ప్రధాని మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్ రాజధాని అహ్మదాబాద్తో కలుపుతుంది. ఈ రెండు నగరాల మధ్య దూరం 505 కిలోమీటర్లుగా ఉంది. ప్రస్తుతం ముంబై నుండి అహ్మదాబాద్కు వెళ్లాలంటే 8 గంటలు ప్రయాణ సమయం పడుతుంది.
అదే గనుక ఈ బుల్లెట్ రైలు పట్టాలెక్కిన పక్షంలో ముంబై, అహ్మదాబాద్ల మధ్య ప్రయాణ సమయం ఎనిమిది గంటల నుంచి దాదాపు మూడు గంటలకు తగ్గిపోతుంది. ముంబై-అహ్మదాబాద్ మార్గంలో బుల్లెట్ రైళ్లను నడపడంలో సాధ్యాసాధ్యాలపై 2013 డిసెంబరులో మొదలైన అధ్యయనం ఈ ఏడాది జులైలో ముగిసింది.
ఈ బుల్లెట్ రైలు వాస్తవ పనులు మొదలైనప్పటి నుంచి ఏడేళ్లలో పని పూర్తవుతుంది. ఈ బుల్లెట్ రైలు ఒప్పందం కుదిరిన తర్వాత దేశ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఒక్క బుల్లెట్ రైలు ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఒక్క బుల్లెట్ రైలే కదా అనుకుంటే పొరపాటు:
ఒక్క బుల్లెట్ రైలే కదా అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఈ బుల్లెట్ రైలు ఒప్పందం దేశ స్థితిగతులనే మార్చబోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే భారతీయ రైల్వే ముఖ చిత్రాన్నే ఈ బుల్లెట్ రైలు మార్చబోతోంది. ఈ ప్రాజెక్టు భారతీయ రైల్వేలో విప్లవానికి శ్రీకారం చుడుతుంది.
ఈ బుల్లెట్ రైలు భవిష్యత్తులో భారతీయ రైల్వేల ప్రయాణాన్ని వేగవంతం చేస్తుంది. ప్రపంచ దేశాల్లో భారత్ ఆర్ధిక రూపాంతరీకరణ చోదకశక్తిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహాం లేదు. భారతీయ రైల్వేలు దేశ వ్యాప్తంగా 65,806 కిలోమీటర్లు రైల్వే ట్రాక్లను కలిగి ఉండి ప్రయాణికులను తమ తమ గమ్యస్థానాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
బిజీగా ఉండే రూట్లలో ప్రయాణికుల ట్రాఫిక్ 150 శాతంగా ఉందంటే వీటి ప్రాముఖ్యత ఏమాత్రం ఉందో అర్ధమవుతుంది. ప్రయాణికులు భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టును భారత్లో నిర్మించనున్నారు. ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టును ఇరు దేశాలకు చెందిన రైల్వే రీసెర్చ్ అర్గనైజేషన్స్ ఆర్డీఎస్ఓ (ఇండియా), ఆర్టీఆర్ఐ (జపాన్)ల భాగస్వామ్యంతో నిర్మించనున్నారు.
ఎన్డీఏ ప్రభుత్వానికి సాధించిన ఘనత:
ప్రపంచంలో మొట్టమదటి హైస్పీడ్ రైల్వే సిస్టమ్ను 1964లో జపాన్ దేశం నిర్మించింది. ఆ తర్వాత 1981లో ఫ్రాన్స్, 1989లో ఇటలీ, 1991లో జర్మనీ, 1992లో స్పెయిన్, 1997లో బెల్జియం దేశాలు నిర్మించాయి. గత 50 ఏళ్లుగా ఈ హైస్పీడ్ రైల్వే సిస్టమ్ను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నా దానిని సాధించ లేకపోయాం.
దశాబ్దాలుగా గత ప్రభుత్వాలు నిర్మించలేని ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టును ఎన్డీఏ ప్రభుత్వం నిర్మించడానికి ముందుకు వచ్చినందుకు గాను మనం అభినందనలు తెలియజేయాలి. కిలోమీటరకు గాను ఈ హైస్పీడ్ రైలు నిర్మాణానికి అయ్యే ఖర్చు రూ. 140 కోట్లు.
విజయవాడలో నిర్మించనున్న మెట్రో రైలు ప్రాజెక్టులకు ఒక కిలోమీటరుకు అయ్యే ఖర్చు రూ. 288 కోట్లు. అదే ఢిల్లీ మెట్రో నిర్మాణానికి అయిన ఖర్చు రూ. 178 కోట్లు. 1997లో నిర్మించిన ఈ ఢిల్లీ మెట్రో రైలు ప్రాజెక్టుకు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (గతంలో జపాన్ బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్) 60 శాతం మేరకు రుణమిచ్చింది.
ఈ రుణాన్ని 1.2 శాతం వడ్డీ రేటుతో 30 ఏళ్ల కాల పరిమితితో తిరిగి చెల్లించాల్సిందిగా నిబంధన విధించింది. ఢిల్లీ మెట్రోతో ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టును పోల్చి చూస్తే ఎంతో ఉత్తమంగా కనిపిస్తుంది. ఇక టికెట్ ధర విషయానికి వస్తే కామన్ మ్యాన్ ప్రయాణించే విధంగా మొదటి తరగతి ఏసీ టికెట్ ధర మాదిరిగానే ఉంటాయి.
'మేకిన్ ఇండియా'కు ఊతం:
‘మేకిన్ ఇండియా' కార్యక్రమం కింద ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఇందులో భాగంగా పెట్టుబడుల్ని ప్రోత్సహించడానికి ‘జపాన్-భారత్ మేకిన్ఇండియా ప్రత్యేక ఆర్థిక సదుపాయం' కింద 1.5 ట్రిలియన్ యెన్ల (సుమారు రూ.83,000 కోట్లు) నిధిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
నిప్పన్ ఎగుమతులు-పెట్టుబడుల బీమా సంస్థ, జపాన్ అంతర్జాతీయ సహకార బ్యాంకు సంయుక్తంగా ఈ నిధిని సమకూర్చనున్నాయి. ట్రాన్సర్ ఆఫ్ టెక్నాలజీ(టీఓటీ)లో భాగంగా ఈ బుల్లెట్ రైలు కోసం కోచ్లను సైతం భారత్లోనే తయారు చేయనున్నారు.
జపాన్ సహాకారంతో ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టు భారత్లోనే ఓ అద్భుతమైన ప్రాజెక్టుగా నిలవనుంది. దీంతో పాటు హైస్పీడ్ రైల్వే సిస్టమ్స్కు సంబంధించి ఓ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ను కూడా భారత్లో నెలకొల్పేందుకు జపాన్ అంగీకరించింది.
ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో ప్రధాన తయారీదారు జపాన్కు చెందిన కంపెనీ ఉండగా, ఆ కంపెనీలు భారత్ కంపెనీల సహాయం తీసుకోనున్నాయి. జపాన్, భారత్లకు చెందిన కంపెనీలు సంయుక్తంగా ఏర్పడి ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టును నిర్మించేలా ఒప్పందం కుదిరింది.
బుల్లెట్ రైలు ప్రాజెక్టులో జపాన్ భాగస్వామ్యం వల్ల కలిగే ప్రయోజనాలు:
* ఆసియా ఖండంలో భారత్ ఆర్థిక స్వప్నాలను సాకారం చేసుకోవడానికి సహకరించే మిత్ర దేశాల్లో జపాన్ను మించింది మరొకటి లేకపోవడమే.
* ప్రపంచంలో వేగం, విశ్వసనీయత, భద్రతకు జపనీస్ షింకన్సేన్ టెక్నాలజీ పేరుగాంచింది. గత 50 ఏళ్లుగా జపాన్లో సేవలందిస్తోందన్న ఈ షింకన్సేన్ టెక్నాలజీ వల్ల ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోలేదు.
* ఉత్యుత్తమ ప్రదర్శనలో జపాన్ రైల్వే సిస్టమ్ ప్రపంచంలోనే అత్యంత గొప్పది. జపాన్లో రైలు ఆలస్యంగా నడిచే సమయం కేవలం ఒక్క నిమిషం మాత్రమే అంటే నమ్మండి.
* బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం అసాధారణమైన రీతిలో దాదాపు 12 మిలియన్ డాలర్ల ప్యాకేజీకి తోడు అత్యంత సరళమైన నియమ నిబంధనలతో సాంకేతిక సాయం అందించడానికి జపాన్ ముందుకు రావడం.
* భూకంపాలు లాంటి వాటిని ముందుగానే గుర్తించగలిగే సత్తా జపాన్ రైల్వే సిస్టమ్కు ఉంది.